అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదని, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర 12వ అవతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న అనంతరం.. పరేడ్ గ్రౌండ్స్ లో సీఎం మాట్లాడారు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ ప్రసంగం మొదలు పెట్టిన సీఎం.. రెండున్నరేళ్లలో కాంగ్రెస్ చేపట్టిన అభివృద్ధి పనులు, అమలు చేసిన సంక్షేమ పథకాల సక్సెస్ గురించి వివరించారు. తెలంగాణ కలను సాకారం చేసిన నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ కు, కృషి చేసిన సోనియాగాంధీకి ధన్యవాదాలు తెలిపారు. పుట్టుకనీది, చావునీది.. బతుకంతా దేశానిది అన్న కాళోజీ మాటలను గుర్తు చేసుకున్నారు. కాళోజీ స్ఫూర్తితో అధికారం చేపట్టిన నాటి నుంచీ రాష్ట్ర హితం కోసమే శ్రమిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సంక్షేమం, అభివృద్ధికి సమప్రాధాన్యమిస్తున్నామని తెలిపారు.
పేదలకు సొంతిళ్లు సాకారం అనేది మాటల్లో చెప్పలేనిది. పేదలను అద్దె ఇళ్ల బాధల నుంచి విముక్తి చేయాలని నిర్ణయించాం. 13 నెలల కాలంలో 1.25 లక్షల ఇందిరమ్మ ఇళ్లను నిర్మించాం. రూ.22 వేల కోట్లతో పేదల ఇళ్ల కోసం ఖర్చు చేస్తున్నాం. ఈ ఆర్థిక సంవత్సరంలోనూ 3.50 లక్షల ఇళ్లను మంజూరు చేశాం. ఈసారి క్యూర్ పరిధిలో లక్ష ఇందిరమ్మ ఇళ్లను నిర్మిస్తాం. పేదలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కొత్త రేషన్కార్డులు ఇచ్చాం.’’ అని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ సేవలు అందించిన పోలీసు అధికారులకు విశిష్టసేవా పురస్కారాలను ప్రదానం చేశారు.
గత పదేళ్ల తెలంగాణ ప్రయాణాన్ని ప్రస్తావించిన ముఖ్యమంత్రి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు సమిష్టి కృషి అవసరమని పిలుపునిచ్చారు.అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ, వారి ఆశయాలకు అనుగుణంగా తెలంగాణను మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రజల సహకారంతో సుస్థిర అభివృద్ధి, పారదర్శక పాలన దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఆయన వెల్లడించారు. ప్రతి పేద ప్రజలకు సన్న బియ్యం అందిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.
రాష్ట్రంలోని వృద్ధుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని వెల్లడించారు. వృద్ధాశ్రమాల్లో నివసిస్తున్న పెద్దలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు, వారి ఆరోగ్యం, భద్రత, సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని పేర్కొన్నారు.సమాజానికి సేవ చేసిన పెద్దలను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. వృద్ధుల సంక్షేమం కోసం ప్రభుత్వం మరిన్ని కార్యక్రమాలు అమలు చేస్తుందని స్పష్టం చేశారు. ఒంటరిగా జీవిస్తున్న వృద్ధులకు అండగా నిలవడంతో పాటు, వారికి అవసరమైన అన్ని సేవలను అందించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.




Total views : 92029