పిఠాపురం నియోజకవర్గంలోని జల్లూరు, మల్లం గ్రామాలకు చెందిన చిన్న, సన్నకారు కౌలు రైతులు భారీ
మోసానికి గురయ్యామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతు బత్తిన రామ్మూర్తి కుమారుడు బత్తిన పద్మరాజు కౌలు భూముల పేరుతో పలువురు రైతుల నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసి మోసం చేశాడని బాధితులు ఆరోపిస్తున్నారు. రైతుల కథనం ప్రకారం, ఒకే భూమిని పలువురికి కౌలుకు ఇస్తూ, ఒక్కో రైతు నుంచి రూ.2.50 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు శిస్తు రూపంలో వసూలు చేసినట్లు చెబుతున్నారు. ఇలా సుమారు రూ.2.5 కోట్లకు పైగా సొమ్ము సేకరించి, అనంతరం మల్లం గ్రామాన్ని విడిచి కాకినాడ రూరల్ మండలంలోని సర్పవరం ప్రాంతానికి మకాం మార్చినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో మోసపోయిన రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారు. తమ పిల్లల చదువులు, పెళ్లిళ్లు, కుటుంబ అవసరాల కోసం దాచుకున్న సొమ్మును పెట్టుబడిగా పెట్టి ఇప్పుడు రోడ్డున పడ్డామని కన్నీటి పర్యంతమవుతున్నారు. పద్మరాజు ఆచూకీ కోసం రెండేళ్లుగా వెతికిన తర్వాత సర్పవరం ప్రాంతంలో అతని నివాసాన్ని గుర్తించిన రైతులు అక్కడికి వెళ్లి నిలదీయగా, తమపైనే కేసులు పెడతానంటూ బెదిరించాడని ఆరోపిస్తున్నారు. దీంతో ఆగ్రహానికి గురైన సుమారు 50 మంది కౌలు రైతులు పద్మరాజుకు సంబంధించిన పొలంలోనే వంటావార్పు నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. తమకు జరిగిన అన్యాయంపై ప్రభుత్వం వెంటనే స్పందించి నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మోసానికి గురైన రైతులకు న్యాయం చేయాలని, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుని తమ సొమ్ము తిరిగి ఇప్పించాలని రాష్ట్ర డిప్యూటీ సీఎం ను రైతులు వేడుకుంటున్నారు.
పిఠాపురం నియోజకవర్గంలో భారీ కౌలు భూ మోసం…
26
previous post



Total views : 92036