భారత్కు అమెరికా ఊహించని షాక్ ఇచ్చింది. అమెరికా ట్రేడ్ రిప్రజెంటేటివ్ కార్యాలయం విడుదల చేసిన తాజా నివేదికలో భారత్ను దోషుల జాబితాలో చేర్చింది. ట్రేడ్ యాక్ట్-1974లోని సెక్షన్-301 కింద నిర్వహించిన దర్యాప్తుల్లో భారత్ సహా 54 దేశాలు బలవంతపు శ్రమతో తయారయ్యే వస్తువుల దిగుమతులను అరికట్టడంలో తగిన చర్యలు తీసుకోవడం లేదని యూఎస్టిఆర్ పేర్కొంది. ఈ నివేదిక ఆధారంగా భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే పలు ఉత్పత్తులపై 10 నుంచి 12.5 శాతం వరకు అదనపు సుంకాలు విధించాలని ప్రతిపాదించింది. ఇప్పటికే పరిమిత ఆంక్షలు అమలు చేస్తున్న దేశాలకు 10 శాతం టారిఫ్ ఉండగా.. భారత్, చైనా, జపాన్, దక్షిణ కొరియా, బ్రెజిల్ వంటి దేశాలకు గరిష్టంగా 12.5 శాతం సుంకం విధించే అవకాశం ఉందని తెలిపింది.
టెక్స్టైల్స్, వస్త్ర ఉత్పత్తుల విషయంలో మాత్రం ప్రత్యేక కోటా విధానంతో కొంత ఉపశమనం కల్పించేందుకు అమెరికా సిద్ధమైంది. అయితే ఈ ప్రతిపాదిత సుంకాలు అమలైతే భారత ఉత్పత్తుల ధరలు అమెరికా మార్కెట్లో పెరిగే అవకాశం ఉంది. దీంతో ఎగుమతులపై ప్రతికూల ప్రభావం పడొచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా.. న్యూఢిల్లీలో భారత్-అమెరికా ఉన్నతాధికారులు ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై కీలక చర్చలు జరుపుతున్న సమయంలోనే ఈ ప్రకటన వెలువడటం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రతిపాదిత టారిఫ్లపై జులై తొలి వారం వరకు ప్రజాభిప్రాయ సేకరణ, సమీక్షలు నిర్వహించి.. అనంతరం తుది నిర్ణయం తీసుకోనున్నారు.



Total views : 92042