ప్రభుత్వం ఆహ్వానం మేరకు ఉద్యోగుల సమస్యలపై చర్చించేందుకు జేఏసీ ప్రతినిధులు సీఎం రేవంత్రెడ్డిని కలిశారు. క్షేత్రస్థాయిలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు, పెరుగుతున్న పని ఒత్తిడి, ఉద్యోగ సంఘాల నాయకులపై ఒత్తిడి వంటి అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా ఆరు డీఏలు పెండింగ్లో ఉండటంతో ఉద్యోగులకు జరుగుతున్న ఆర్థిక నష్టాన్ని వివరించారు.
పీఆర్సీ కమిటీ నివేదిక ఆలస్యం కావడంపై ఉద్యోగుల్లో నెలకొన్న ఆవేదనను కూడా జేఏసీ ప్రతినిధులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఉద్యోగుల సమస్యలపై సుదీర్ఘంగా చర్చించిన రేవంత్రెడ్డి.. తాను ఎల్లప్పుడూ ఉద్యోగుల పక్షాన ఉంటానని హామీ ఇచ్చినట్లు ట్రెసా రాష్ట్ర అధ్యక్షుడు కే.గౌతమ్కుమార్, ప్రధాన కార్యదర్శి రమణ్రెడ్డి తెలిపారు. ఒక్కో సమస్యను పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని సీఎం చెప్పినట్లు వెల్లడించారు.
ఆరు డీఏలపై త్వరలోనే ప్రకటన చేస్తామని.. పీఆర్సీ కమిటీ నివేదిక కూడా వెంటనే తనకు అందేలా చర్యలు తీసుకుంటానని సీఎం హామీ ఇచ్చినట్లు ట్రెసా నాయకులు తెలిపారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై సీఎం సానుకూలంగా స్పందించడంపై ట్రెసా రాష్ట్ర నాయకత్వం హర్షం వ్యక్తం చేసింది. ఉద్యోగుల హక్కులు, సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తామని స్పష్టం చేసింది. సీఎంను కలిసిన వారిలో ట్రెసా గౌరవాధ్యక్షుడు వంగా రవీందర్రెడ్డి ఉన్నారు.