తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు ఐదో రోజుకు చేరుకున్నాయి. గత రెండు రోజులుగా సభలో చోటుచేసుకున్న గందరగోళం, నాటకీయ పరిణామాల నేపథ్యంలో నేటి సమావేశాలు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. స్పీకర్ పోడియంను ముట్టడించి నిరసన తెలిపినందుకు కేటీఆర్, హరీశ్రావు సహా 22 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేయడంతో.. ప్రధాన ప్రతిపక్షం లేకుండానే సభ కొనసాగుతోంది.
ఇక ఇవాళ సభలో 22ఏ నిషేధిత భూముల జాబితా అంశంపై సుదీర్ఘ చర్చ జరగనుంది. నిషేధిత జాబితా నుంచి భూములను తొలగించే అంశంపై సభ్యులు చర్చించనున్నారు. దేశవ్యాప్త జనగణనలో బీసీ కులాల కోసం ప్రత్యేక ఆప్షన్ చేర్చాలన్న డిమాండ్పై తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం ఉంది. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల అమలు, గురుకులాల్లో ఫుడ్ పాయిజనింగ్, పాలిటెక్నిక్ కోర్సుల్లో మార్పులు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై కూడా చర్చకు అవకాశం ఉంది.
మరోవైపు అసెంబ్లీ వెలుపల జరిగిన ఉద్రిక్తతలపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ను ఉద్దేశించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసినట్లు చెబుతున్న వ్యాఖ్యల వెనుక కుట్ర కోణంపైనా విచారణ జరగనుంది. ఐపీఎస్ అధికారి విజయ్కుమార్ నేతృత్వంలో దర్యాప్తు కొనసాగనుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్ నేపథ్యంలో ఆ పార్టీ నేతలు నిరసనలు కొనసాగిస్తుండటంతో.. అసెంబ్లీ వెలుపల కూడా రాజకీయ వేడి కొనసాగే అవకాశం కనిపిస్తోంది.