తెలుగుదేశం పార్టీ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే మహానాడు ఈనెల 27, 28 తేదీల్లో జరగనుంది. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం వేదికగా హైబ్రిడ్ పద్ధతిలో జరగబోతోందని టీడీపీ సీనియర్ నాయకులు, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రకటించారు. పార్టీ స్థాపించినప్పటి నుండి ఇప్పటివరకు 37 మహానాడులు విజయవంతంగా జరిగాయని ఆయన గుర్తుచేశారు. మొదట ఈ మహానాడును నెల్లూరులో భారీ ఎత్తున నిర్వహించాలని ప్రణాళికలు సిద్ధం చేశామని, నెల్లూరులో జరిగి ఉంటే దాదాపు 7 వేల బస్సులు, వేలాది కార్లు, ట్రక్కులు వచ్చేవని అన్నారు. అంతర్జాతీయ యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో వాహనాల సంఖ్యను తగ్గించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపును గౌరవిస్తున్నామన్నారు. దేశంలో ఇంధన కొరతను దృష్టిలో ఉంచుకుని, ఈ నిర్ణయాన్ని ఏపీలోనూ అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భావించారని అన్నారు.
అందుకే నెల్లూరు కాకుండా మంగళగిరి కేంద్ర కార్యాలయంలో హైబ్రిడ్ మహానాడు నిర్వహించాలని నిర్ణయించినట్లు చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో వర్చువల్ హైబ్రిడ్ విధానమే సరైనదని ఆయన అభిప్రాయపడ్డారు. నారా లోకేశ్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత జరుగుతున్న మొదటి మహానాడు ఇదే కావడంతో అందరిలోనూ భారీ ఆసక్తి నెలకొందన్నారు. ఈ కార్యక్రమం మొత్తం ఆయన నేతృత్వంలోనే అట్టహాసంగా జరగబోతోందని తెలిపారు.
ఏపీకి పెట్టుబడులు వరదలా వస్తున్నాయని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్, లోకేశ్ నిరంతర ప్రయత్నాలకు కేంద్ర ప్రభుత్వం మద్దతు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గారి అండ తోడవ్వడంతో రాష్ట్ర అభివృద్ధికి సరికొత్త బాటలు పడ్డాయని అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ రెండేళ్లలోనే లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. అనేక పరిశ్రమలు స్థాపించబడటంతో యువతకు మెండుగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని అన్నారు. రాష్ట్రం నాశనమవ్వాలని కోరుకునే ఏకైక పార్టీ ఒక్క వైసీపీ మాత్రమేనని ధ్వజమెత్తారు. ఇలాంటి దుర్మార్గపు రాజకీయాలను తామెక్కడా చూడలేదని సోమిరెడ్డి మండిపడ్డారు. రాష్ట్ర అభివృద్ధి, భవిష్యత్తు కార్యాచరణపై ఈ మహానాడులో మొత్తం 19 తీర్మానాలను ప్రవేశపెట్టబోతున్నట్లు చెప్పారు.





Total views : 81751