రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా, ఈ రెండేళ్లలో సాధించిన విజయాలను ప్రజలకు తెలియజేసేందుకు ప్రోగ్రెస్ రిపోర్ట్స్ విడుదల చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను, మంత్రులను ఆదేశించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ఎలా అభివృద్ధి పథంలోకి నడిపించారో ఈ నివేదికల ద్వారా ప్రజలకు వివరించాలని ఆయన స్పష్టం చేశారు.
మంత్రులు, ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో చంద్రబాబు ఈ కీలక ఆదేశాలు జారీ చేశారు. 2024లో అధికారంలోకి వచ్చిన వెంటనే గత వైసీపీ ప్రభుత్వ పాలనపై ఏడు అంశాల్లో శ్వేతపత్రాలు విడుదల చేశారు. . రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, పోలవరం ప్రాజెక్టు, అమరావతి రాజధాని, విద్యుత్, శాంతిభద్రతలు, మైనింగ్, ఎక్సైజ్ వంటి అంశాలపై వాస్తవ పరిస్థితులను ఆ శ్వేతపత్రాల ద్వారా ప్రజల ముందు ఉంచారు.
ఇప్పుడు ఆ శ్వేతపత్రాలకు కొనసాగింపుగా ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్స్ ఉండాలని సీఎం సూచించారు. వివిధ శాఖల్లో వచ్చిన మార్పులు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, పాలనా సంస్కరణలను సమగ్రంగా ఇందులో పొందుపరచాలన్నారు. ప్రభుత్వంపై వస్తున్న అసత్య ప్రచారాలను తిప్పికొట్టేందుకు, వాస్తవాలను ప్రజల ముందు ఉంచి రాష్ట్రాన్ని ఎలా గాడిన పెట్టారో స్పష్టంగా తెలియజేయాలని ఆయన దిశానిర్దేశం చేశారు. ఈ నివేదికల ద్వారా రెండేళ్ల ప్రభుత్వ పనితీరును ప్రజలకు సమర్థవంతంగా చేరవేయడమే లక్ష్యమని చంద్రబాబు పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఇవాళ సీఎం చంద్రబాబు విద్యుత్ తో సహా 4 అంశాలపై నివేదికలు విడుదల చేయనున్నారు.