ఇరాన్లో పెళ్లింటిపై జరిగిన దాడి ఘటనపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ స్పందించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని యూఎస్ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తెలిపారు. ఇటీవల దక్షిణ ఇరాన్లో పెళ్లి వేడుక జరుగుతున్న ఓ ఒంటిపై జరిగిన దాడిలో నలుగురు మరణించారు. మరో 68 మంది గాయపడ్డారు. అమెరికా దాడితోనే పెళ్లింట విషాదం నెలకొందని ఇరాన్ ఆరోపిస్తోంది. ఈ ఘటనపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ స్పందింస్తూ దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. ‘మేము దర్యాప్తు చేస్తున్నాము. అసలేం జరిగిందో తెలుసుకోవాలని అనుకుంటున్నాము’ అని వాన్స్ అన్నారు. అంతకుముందు, యూఎస్ సెంట్రల్ కమాండ్ ప్రతినిధి మాట్లాడుతూ తమకు ఇరాన్ దళాల వలె సామాన్యులను టార్గెట్ చేసే అలవాటు లేదని ఘాటుగా జవాబిచ్చారు.
CVR NEWS
భారత క్రికెట్ జట్టు మరో అరుదైన అంతర్జాతీయ మ్యాచ్కు సిద్ధమవుతోంది. జపాన్తో తొలిసారి ప్రత్యేక టీ20 అంతర్జాతీయ మ్యాచ్లో భారత్ తలపడనుంది. భారత్ –జపాన్ దౌత్య సంబంధాలు 75 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈ మ్యాచ్ను నిర్వహిస్తున్నారు. ఈ మ్యాచ్ సెప్టెంబర్ 22, 2026న జపాన్లోని తోచిగి ప్రిఫెక్చర్లో ఉన్న సానో ఇంటర్నేషనల్ క్రికెట్ గ్రౌండ్లో జరగనుంది. ఈ పోరుకు ‘సుజుకి కప్’ గా పేరు పెట్టారు. భారత్, జపాన్ పురుషుల జట్లు ఈ మ్యాచ్లో తలపడనున్నాయి.
భారత్–జపాన్ దౌత్య సంబంధాల 75వ వార్షికోత్సవ వేడుకలకు ఈ మ్యాచ్ శ్రీకారం చుట్టనుంది. ‘స్పోర్ట్ 75’ కార్యక్రమంలో భాగంగా ఈ మ్యాచ్ను నిర్వహిస్తున్నారు. రెండు దేశాల మధ్య క్రీడా సహకారాన్ని, ప్రజల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా మాట్లాడుతూ.. జపాన్లో భారత్ ఆడబోయే ఈ ప్రత్యేక టీ20 మ్యాచ్ క్రికెట్ను తూర్పు ఆసియాలో మరింత విస్తరించేందుకు మంచి అవకాశమని పేర్కొన్నారు. జపాన్లో క్రికెట్ అభివృద్ధికి జపాన్ క్రికెట్ అసోసియేషన్తో కలిసి పనిచేస్తామని బీసీసీఐ వెల్లడించింది.
మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. ఈ మ్యాచ్ జరిగిన రెండు రోజులకే జపాన్లో 2026 ఆసియా క్రీడలు ప్రారంభం కానున్నాయి. భారత్ కూడా ఈ క్రీడల్లో పాల్గొంటుంది. దీంతో జపాన్తో జరిగే టీ20 మ్యాచ్ ఆసియా క్రీడలకు ముందు భారత జట్టుకు సన్నాహక పోరుగా ఉపయోగపడే అవకాశం ఉంది. క్రెక్స్ కథనం ప్రకారం, శ్రేయాస్ అయ్యర్ నేతృత్వంలోని భారత జట్టులోని పలువురు ఆటగాళ్లు ఈ మ్యాచ్లో కనిపించే అవకాశం ఉందని అంచనా. అయితే భారత్ తుది జట్టును బీసీసీఐ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.
సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం త్వరగా ఎన్ఓసీ ఇవ్వాలని తెలంగాణ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి కోరారు. న్యూఢిల్లీలో ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయితో భేటీ అయిన మంత్రి.. సమ్మక్క సాగర్కు సంబంధించిన అంతర్రాష్ట్ర అంశాలపై చర్చించారు. బ్యారేజీ కారణంగా ఛత్తీస్గఢ్లో ముంపునకు గురయ్యే భూములు, ఇళ్లు, ఇతర ఆస్తులకు తెలంగాణ ప్రభుత్వం పూర్తి పరిహారం చెల్లిస్తుందని హామీ ఇచ్చారు. అవసరమైతే పరిహార నిధులను ముందుగానే జమ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. రెండు రాష్ట్రాల ప్రయోజనాలను పరిరక్షిస్తూ సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని కోరారు. సమ్మక్క సాగర్ ద్వారా శ్రీరాంసాగర్ రెండో దశ పరిధిలోని 4.40 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడంతో పాటు మరో 30 వేల ఎకరాలకు కొత్తగా సాగునీరు అందించనున్నట్లు మంత్రి తెలిపారు. ప్రాజెక్టుకు ఇప్పటికే పలు అనుమతులు లభించినా.. ఛత్తీస్గఢ్ ఎన్ఓసీ పెండింగ్లో ఉండటంతో తదుపరి ప్రక్రియ ఆలస్యమవుతోందని చెప్పారు. ఎన్ఓసీ త్వరగా వస్తే ప్రాజెక్టు పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురావచ్చని మంత్రి పేర్కొన్నారు.
రూ.4 కోట్లతో విద్యుత్ సబ్స్టేషన్కు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే భూమి పూజ.
కూటమి ప్రభుత్వంలో ఏపీ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని అన్నారు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండలం కాసరం గ్రామంలో రూ.4 కోట్లతో తలపెట్టిన సబ్స్టేషన్ నిర్మాణ పనులకు ఆయన భూమిపూజ నిర్వహించారు. తన తండ్రి, దివంగత మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కలను సాకారం చేసే దిశగా ఈ సబ్స్టేషన్ నిర్మాణం చేపడుతున్నామని ఎమ్మెల్యే తెలిపారు. రాబోయే మూడు నెలల్లో నిర్మాణ పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని వెల్లడించారు. సబ్స్టేషన్ ఏర్పాటుతో కాసరం పంచాయతీ పరిధిలోని అన్ని గ్రామాలకు నిరంతరాయంగా, మెరుగైన విద్యుత్ సరఫరా అందుతుందని చెప్పారు. ముఖ్యంగా రైతులకు సాగునీటి అవసరాలకు నాణ్యమైన విద్యుత్ అందుతుందని.. పంట పొలాల సాగుకు ఎదురవుతున్న విద్యుత్ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని తెలిపారు.
రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమాన్ని సమాంతరంగా ముందుకు తీసుకెళ్తున్నామని ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు.
అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించడంతో పాటు ప్రజలకు నాణ్యమైన విద్యుత్, తాగునీటి సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు.
బాపట్ల జిల్లా కారంచేడులో సీఎస్ఆర్ నిధులతో ఏర్పాటు చేసిన మూడు సామాజిక నీటి శుద్ధి కేంద్రాలను మంత్రి ప్రారంభించారు.
నీటి శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసిన దాతలను మంత్రి అభినందించారు.
ప్రాజెక్టులను ఏర్పాటు చేయడం ఎంత ముఖ్యమో.. అవి ప్రజలకు దీర్ఘకాలం ఉపయోగపడేలా నిర్వహించడం కూడా అంతే ముఖ్యమన్నారు.
కారంచేడులో మూడు, నాలుగు దశాబ్దాల తర్వాత నీటి సరఫరా వ్యవస్థను మెరుగుపరిచేందుకు రూ.3.50 కోట్లతో కొత్త పైపులైన్లు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.
మరో రూ.6 కోట్లతో పూర్తిస్థాయిలో కొత్త పైపులైన్ల నిర్మాణానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు మంత్రి తెలిపారు.
ఎల్-నీనో నేపథ్యంలో వ్యవసాయ శాస్త్రవేత్తల సూచనలు కీలకమని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రంలో శుక్రవారం ఎల్-నీనో అవగాహన సదస్సు నిర్వహించారు. కృష్ణానది నీటి కొరత నేపథ్యంలో పట్టిసీమ ప్రాజెక్టు ఆదుకుందని బుద్ధప్రసాద్ తెలిపారు. అవనిగడ్డ నియోజకవర్గంలో ఇంకా 15 వేల ఎకరాల్లో నాట్లు వేయాల్సి ఉందన్నారు. నాట్లు వేయని రైతులకు సహాయం చేసే అంశాన్ని ప్రభుత్వం కచ్చితంగా ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. కృష్ణా డెల్టా రైతుల సమస్యల పరిష్కారానికి గతంలోనూ పోరాడినట్లు ఎమ్మెల్యే గుర్తుచేశారు. సాగునీటి విషయంలో రైతులకు న్యాయం చేసే అంశంలో రాజీపడేది లేదని స్పష్టం చేశారు. ప్రపంచ దేశాల్లో విస్తరించిన సూపర్ ఎల్-నీనో దుష్ప్రభావంతో తీవ్ర సాగునీటి కొరత ఎదురవుతోందన్నారు. ప్రస్తుత పరిస్థితులను రైతులు అర్థం చేసుకుని.. వ్యవసాయ శాస్త్రవేత్తల సూచనలకు అనుగుణంగా ముందుకు సాగాలని కోరారు. సాగునీటి సమస్య నుంచి బయటపడేందుకు రైతులు ప్రత్యామ్నాయ మార్గాలపై ఆలోచించాలని బుద్ధప్రసాద్ సూచించారు.
విశాఖ ఆటోనగర్లో ఆల్కలైన్ అయనైజ్డ్ డ్రింకింగ్ వాటర్ ప్లాంట్ను ఎంఎస్ఎంఈ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. యువతకు కూటమి ప్రభుత్వం ఎంఎస్ఎంఈ రంగం ద్వారా అందిస్తున్న రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఉపాధి అవకాశాల కోసం యువత ఇతర రాష్ట్రాలకు వెళ్లే పరిస్థితికి ముగింపు పలికేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.
యువత కొత్త పరిశ్రమలు స్థాపించే దిశగా ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తోందని తెలిపారు.
ముఖ్యంగా మ్యానుఫ్యాక్చరింగ్, ప్యాకేజింగ్ పరిశ్రమల్లో మంచి లాభదాయక అవకాశాలు ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఆమోదించిన ఏడు రాయితీలు హర్షణీయమన్నారు.
సింగిల్ విండో విధానంతో యువత పరిశ్రమలు స్థాపించుకునేందుకు ఎంఎస్ఎంఈ శాఖ సహకరిస్తుందని తెలిపారు.
శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు విస్తృతంగా పర్యటించారు. కేంద్ర, రాష్ట్రాల్లో కూటమి ప్రభుత్వం ఉండటంతో దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం చూపుతున్నామని, సంక్షేమం-అభివృద్ధిని సమాంతరంగా ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. కంచిలి, ఇచ్చాపురం, కవిటి మండలాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. రూ.1.31 కోట్లతో రెండు బీటీ రోడ్లు, రూ.2.29 కోట్ల సీఎస్ఆర్ నిధులతో బ్యాడ్మింటన్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, రూ.6 కోట్లతో రెండు ఆర్యూబీలకు పనులు ప్రారంభించారు. జిల్లాలో మౌలిక వసతులను మరింత విస్తృతం చేసి.. ప్రజల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రామ్మోహన్ నాయుడు హామీ ఇచ్చారు.
అమరావతిలో ఉద్యోగ సంఘాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక భేటీకి సిద్ధమయ్యారు. రేపు రాష్ట్రంలోని ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సీఎం సమావేశం కానున్నారు. ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి డిమాండ్లు, పరిష్కరించాల్సిన అంశాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. ప్రతి ఉద్యోగ సంఘం నుంచి ఒక్కో ప్రతినిధిని సమావేశానికి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఉద్యోగ సంఘాలతో నేరుగా సమావేశమై వారి సమస్యలను తెలుసుకుని, పరిష్కార మార్గాలపై చర్చించేందుకు ప్రభుత్వం ఈ భేటీ నిర్వహించనుంది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ఉద్యోగుల సమస్యలు, ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలపై సంఘాల ప్రతినిధులు ముఖ్యమంత్రికి తమ అభిప్రాయాలను వివరించే అవకాశం ఉంది. ఈ సమావేశం నేపథ్యంలో ఉద్యోగ సంఘాల్లోనూ ఆసక్తి నెలకొంది. సీఎం చంద్రబాబు ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో ఎలాంటి అంశాలపై చర్చిస్తారు? వారి సమస్యల పరిష్కారానికి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
తెలంగాణ శాసనసభ, మండలి వర్షాకాల సమావేశాలకు ముహూర్తం ఖరారయింది. సెప్టెంబర్ 7వ తేదీ నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు శాసనసభ కార్యదర్శి అధికారిక సర్కులర్ జారీ చేశారు. 7వ తేదీ ఉదయం 10 గంటల నుంచి సభలు ప్రారంభమవుతాయని, శాసనసభ సభ్యులతో పాటు మండలి సభ్యులకు కూడా సమాచారాన్ని అందిస్తూ.. సర్క్యులర్ పంపారు. వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా ప్రాముఖ్యత కలిగిన అంశాలపై ప్రశ్నలు ఇవ్వాలని ఎమ్మెల్యేలకు కార్యదర్శి సూచించారు. 2వ తేదీలోగా వాటిని అందించాలని తెలిపారు. రూల్ 39 ప్రకారం సభ్యులు అడిగే ప్రశ్నలకు సభలో మంత్రులు సమాధానమివ్వాల్సి ఉంటుంది. ముందస్తు ప్రశ్నలను సంబంధిత శాఖలకు పంపి.. తెలంగాణ ప్రభుత్వం సమాధానాలను సిద్ధం చేయనుంది.
సమావేశాలు ఎన్ని రోజుల నిర్వహించాలన్న అంశంపైన తొలి రోజు సభ ముగిసిన తర్వాత నిర్వహించే బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. ఈ సారి సభల్లో 22ఏ అంశం, కృష్ణా, గోదావరి జలాలు వినియోగం ఇంకా అనేక అంశాలు చర్చకు వచ్చే అవకాశాలున్నాయని అసెంబ్లీ వర్గాలు తెలిపాయి. ఢిల్లీలోని జంతర్ మంతర్ లో సీజేపీ ఆందోళన, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామాల అనంతరం నెక్లస్ రోడ్ లో టీపీసీసీ ర్యాలీ నిర్వహించారు. ఆ ర్యాలీలో ప్రసంగించిన సీఎం రేవంత్ రెడ్డి యువత చట్ట సభలకు పోటీ చేసే వయసును 25 నుంచి 21ఏళ్లకు తగ్గించాలని, అసెంబ్లీలో తీర్మానం చేస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ఈ తీర్మానం చేసే అవకాశాలున్నాయని అసెంబ్లీ వర్గాలు వెల్లడించాయి. కాగా.. ఈ అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ కూడా రావాలని సీఎం రేవంత్ రెడ్డి గతంలోనే కోరారు. ఈ సమావేశాల్లో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, ఆర్థిక పరిస్థితి, సాగునీటి ప్రాజెక్టులు వంటి అంశాలపై లోతుగా చర్చించనున్నారు.