మమతాబెనర్జీకి షాక్ ఇచ్చారు ఆ రాష్ట్ర గవర్నర్ R.N. రవి. నిన్నటితో పదవీకాలం ముగియడంతో బెంగాల్ అసెంబ్లీని రద్దు చేశారు. సీఎం పదవికి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మమతా బెనర్జీ రాజీనామా చేయకపోవడంతో.. గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని గవర్నర్ బర్తరఫ్ చేసినట్లు అయింది. ఈ నేపథ్యంలో బెంగాల్లో రేపు కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. ఇవాళ బీజేపీఎల్పీ సమావేశంలో శాసనసభాపక్ష నేతను ఎన్నుకోనున్నారు ఎమ్మెల్యేలు.
294 స్థానాలు ఉన్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి రెండు విడతలుగా ఎన్నికలు జరిగాయి. మే 4న వెలువడిన ఫలితాల్లో బీజేపీ ఘనవిజయం సాధించింది. సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్పష్టమైన మెజార్టీ ఇచ్చారు ఓటర్లు.
దీంతో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బీజేపీ అగ్రనేతలు ముహూర్తం ఖరారు చేశారు. మే 9న ఉదయం10 గంటలకు ప్రతిష్టాత్మక బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్లో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుందని సమీక్ భట్టాచార్య ప్రకటించారు. మరోవైపు ముఖ్యమంత్రి అభ్యర్థిపై పలువురి పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీపై ఘన విజయం సాధించిన సువేందు అధికారిని ముఖ్యమంత్రిగా నియమిస్తారనే ప్రచారం జరుగుతోంది.






Total views : 75164