కామారెడ్డి నియోజకవర్గంలో సీఎం కేసీఆర్పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పోటీ అధికారికంగా ఖరారైంది. కామారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా పార్టీ అధిష్ఠానం ప్రకటించింది. 16 మంది అభ్యర్థులతో కూడిన మూడో విడత జాబితాను విడుదల చేసింది. నిజామాబాద్ అర్బన్ సీటును సీనియర్ లీడర్ షబ్బీర్ అలీకి పార్టీ కేటాయించింది. ఇక చెన్నూరు నుంచి జి.వివేక్ వెంకటస్వామి పోటీ చేస్తున్నట్టు ప్రకటించింది. రెండు సీట్లలో అభ్యర్థులను మార్చుతూ పార్టీ నిర్ణయం తీసుకుంది. బోథ్ నియోజకవర్గంలో అశోక్ స్థానంలో ఆదె గజేందర్, వనపర్తిలో చెన్నారెడ్డి స్థానంలో మేఘారెడ్డికి సీట్లు కేటాయిస్తూ మార్పులు చేసింది. మరోవైపు పొత్తులో భాగంగా కొత్తగూడెం సీటును సీపీఐకి కేటాయించింది. తాజా జాబితాతో మొత్తం 114 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించినట్టయ్యింది. తుంగతుర్తి, సూర్యాపేట, మిర్యాలగూడ, చార్మినార్ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది.
సీఎం కేసీఆర్
బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ శనివారం కోనాయిపల్లి రానున్నారు. తాను సెంటిమెంట్గా భావించే వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, నామినేషన్ల పత్రాలపై సంతకాలు చేయనున్నారు. 1983లో టీడీపీ తరఫున తొలిసారి సిద్దిపేట ఎమ్మెల్యేగా బరిలోకి దిగిన కేసీఆర్.. ఓటమి పాలయ్యారు. 1985లో వచ్చిన మధ్యంతర ఎన్నికల సందర్భంగా సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం కోనాయిపల్లిలోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో పూజలు నిర్వహించి.. నామినేషన్ దాఖలు చేశారు. ఆ ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించడంతో కోనాయిపల్లి ఆలయంలో పూజలు చేసి, నామినేషన్లు దాఖలు చేయడం కేసీఆర్కు సెంటిమెంట్గా మారింది. అప్పటి నుంచి ప్రతి ఎన్నికల సమయంలోనూ కేసీఆర్ ఇదే ఆలయానికి వచ్చి పూజలు చేసిన అనంతరం నామినేషన్ వేస్తున్నారు.ఈ అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాల నుంచి బరిలో దిగుతున్న కేసీఆర్ ఈసారి కూడా వెంకటేశ్వరస్వామి ఆలయంలో పూజలు నిర్వహించిన తర్వాత రెండు వేర్వేరు నామినేషన్ సెట్లపై సంతకాలు చేయనున్నారు. ఈనెల 9న ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో నామినేషన్లు దాఖలు చేయనున్నారు. కాగా, మంత్రి హరీశ్రావు సైతం కేసీఆర్తోపాటు ఇదే ఆలయంలో నామినేషన్ పత్రాలపై సంతకాలు చేసే ఆనవాయితీని 2004 నుంచి కొనసాగిస్తున్నారు.
ఒకే లక్ష్యంతో ముందుకు సాగితే విజయం వరిస్తుందని, దీనికి సీఎం కేసీఆర్ జీవితమే ఉదాహరణ అని మంత్రి కేటీఆర్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మారుమూల ప్రాంతంలో పుట్టారని, ముంబైలోని షాపూర్జీ పల్లోంజీ కాంపెనీలో కాంట్రాక్టులు చేశారని చెప్పారు. రాజకీయాల్లో ప్రవేశించిన మొదట్లో సింగిల్ విండో ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయారన్నారు. అయినా పట్టుదలతో రాజకీయాల్లో కొనసాగారని తెలిపారు. ఆర్వాత ఎన్నికల్లో గెలిచి మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోలేదని వెల్లడించారు. హైదరాబాద్ పార్క్ హయత్లో గిరిజన ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సక్సెస్ మీట్లో మంత్రి సత్యవతి రాథోడ్తో కలిసి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గిరిజన పారిశ్రామిక వేత్తలను చూస్తుంటే సంతోషంగా ఉందన్నారు. ఏ కులంలో పుట్టామనేది ముఖ్యం కాదని, అవకాశాలను అందిపుచ్చుకోవడం ప్రధానమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్నివిధాలుగా అండగా ఉంటున్నదని చెప్పారు. భవిష్యత్ తరాలకు మార్గదర్శకులు కావాలన్నారు.
ఎర్రవల్లిలోని సీఎం కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం వేదికగా చేపట్టిన రాజశ్యామలా సహిత సుబ్రహ్మణ్యేశ్వర యాగం రెండో రోజూ కొనసాగుతోంది. యాగంలో ఈరోజు ప్రధానంగా రాజశ్యామల యంత్ర పూజ నిర్వహిస్తారు. కేసీఆర్ దంపతులు స్వయంగా ఈ పూజలో పాల్గొంటారు. విశాఖ శారదా పీఠాధిపతులతో పాటు రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ యాగ క్రతువును పర్యవేక్షిస్తున్నారు. యాగశాలలో ఈరోజు రాజశ్యామల అమ్మవారు శివకామ సుందరీ దేవి అవతారంలో దర్శనమిస్తున్నారు. యాగంలో మొత్తం మూడు లక్షలకు మించి రాజశ్యామల మూల మంత్రాలను హవనం చేస్తారు. అలాగే 11 సార్లు శూలినీ దుర్గ కవచ పారాయణ ఉంటుంది. సర్వ లోక సంరక్షణార్ధం ఇంద్ర సూక్త హోమం, నవగ్రహ సూక్త హోమం నిర్వహిస్తారు. షడావరణ సహిత మూల మంత్రాలతో సుబ్రహ్మణ్య కవచ యాగం కూడా నిర్వహిస్తారు.
ఏది నిజమో తెలిసిన తర్వాతే ఓటెయ్యాలని సీఎం కేసీఆర్ అన్నారు. హుజూర్నగర్లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. ఎన్నికల్లో ఒక్కో పార్టీ నుంచి ఒక వ్యక్తి బరిలో నిలబడతాడతారన్నారు. వారి వెనక ఒక పెద్ద పార్టీలు ఉంటాయని, ఆ పార్టీల వైఖరి, చరిత్ర, ప్రజల పట్ల వాటి దృక్పథం ఏంటనేది ఆలోచించాలని కోరారు. పార్టీల సిద్ధాంతాలు, ఎవరి కోసం పనిచేస్తాయనేది ప్రతి ఒక్కరూ గమనించాలన్నారు. ఈ అంశాలపై ప్రజలు చర్చించాలన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో బ్రహ్మాండమైన ఆయుధం ఈ ఓటు అని అన్నారు. నాయకులు.. కళ్ల ముందు జరిగిన చరిత్రను వక్రీకరిస్తారు. ఏది నిజమో తెలిసిన తర్వాతే ప్రజలు ఓటు వేయాలి అని కేసీఆర్ తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో సాగునీరు, మంచినీళ్ల కోసం అనేక కష్టాలు పడ్డాం.. ఇవాళ అన్ని సమస్యలను అధిగమించుకున్నాం అని కేసీఆర్ తెలిపారు. గిరిజన తండాలను గ్రామపంచాయతీలుగా తీర్చిదిద్దుకున్నాం.. వారి హక్కులను కాపాడామన్నారు.