శ్రీ సత్య సాయి జిల్లా, హిందూపురం నియోజకవర్గం, లేపాక్షి మండలంలోని కూర్లపల్లి గ్రామంలో సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పర్యటించారు. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో, హెరిటేజ్ ఫుడ్స్ సంస్థ సీఎస్ఆర్ నిధుల ద్వారా రూ.24 లక్షలు వెచ్చించి నూతన పాఠశాల భవనాన్ని నిర్మించింది.
ఈ సందర్భంగా నారా భువనేశ్వరి నూతన పాఠశాల భవనాన్ని ప్రారంభించి, తరగతి గదులను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో ఆత్మీయంగా ముచ్చటించి వారి విద్యాభ్యాసం గురించి తెలుసుకున్నారు. ప్రతి విద్యార్థి ఆంగ్ల భాషలో మాట్లాడే నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు.
విద్యార్థులతో సరదాగా మాట్లాడిన ఆమె, “మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఎవరు?” అని ప్రశ్నించారు. దీనికి విద్యార్థులు “నారా లోకేష్ బాబు” అని సమాధానం ఇవ్వగా, “నారా లోకేష్ అని చెప్పాలి” అని సూచించారు. నారా లోకేశ్ నాయకత్వంలో రాష్ట్రంలో విద్యా రంగ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. విద్యార్థులకు మెరుగైన వసతులతో కూడిన నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యమని పేర్కొన్న భువనేశ్వరి, భవిష్యత్తులో ఉన్నత చదువులు అభ్యసించి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని విద్యార్థులకు ఆకాంక్షించారు.
కూర్లపల్లి ప్రభుత్వ పాఠశాలకు నూతన భవనం అందుబాటులోకి రావడంతో గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేయగా, విద్యార్థుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. పాఠశాల అభివృద్ధి గ్రామ విద్యా ప్రగతికి దోహదపడుతుందని స్థానికులు అభిప్రాయపడ్డారు.





Total views : 180271