అడవుల ఒడిలో పుట్టిన గిరిజన ఉత్పత్తులకు దేశవ్యాప్త మార్కెట్ దిశగా అరకులోయలో కీలక అడుగు పడింది. గిరిజన కళ, కృషి, సంప్రదాయానికి జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావాలనే లక్ష్యంతో నిర్వహించిన ట్రైబల్ ఆర్టిజన్ మేళా విశేష స్పందన లభిస్తోంది. భారత ప్రభుత్వ గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ట్రైఫెడ్, హైదరాబాద్ సహకారంతో జరిగిన ఈ ఎంపానెల్మెంట్ మేళాలో అల్లూరి, రంపచోడవరం, మన్యం ప్రాంతాల నుంచి గిరిజన కళాకారులు, రైతులు, స్వయం సహాయక సంఘాలు, ఎఫ్పీఓలు భారీగా పాల్గొన్నారు.
అరకు కాఫీ, పసుపు, మిరియాలు, రాగి, చిరుధాన్యాలు, రాజ్మా, అడ్డాకులు, కొండ చీపుర్లు వంటి స్వచ్ఛమైన గిరిజన ఉత్పత్తులు సందర్శకులను ఆకట్టుకోగా, లక్క బొమ్మలు, వెదురు వస్తువులు, మట్టి పాత్రలు, టెర్రకోట కళాఖండాలు గిరిజన సంస్కృతిని ప్రతిబింబించాయి. ఈ మేళా ద్వారా గిరిజన ఉత్పత్తులకు అధికారిక గుర్తింపు కల్పించి …జాతీయ మార్కెట్లో ప్రవేశపెట్టే ప్రక్రియను ప్రారంభించారు.
గిరిజన ఉత్పత్తులకు సరైన ధర, విశాలమైన మార్కెట్ అందించడమే ఈ కార్యక్రమం లక్ష్యమని జిల్లా కలెక్టర్ నిశాంతి తెలిపారు. దేశవ్యాప్తంగా మార్కెటింగ్ అవకాశాలు పెరగడం ద్వారా వేలాది గిరిజన కుటుంబాలకు స్థిరమైన ఉపాధి, అధిక ఆదాయం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సేంద్రియ పద్ధతుల్లో పండించిన ఉత్పత్తులకు దేశవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉండే అవకాశముందని పేర్కొన్నారు.
మొత్తానికి “అడవి నుంచి దేశవ్యాప్త మార్కెట్ వరకు… గిరిజన శ్రమకు సరైన గౌరవం, సరైన ధర” అందించాలనే లక్ష్యంతో నిర్వహించిన అరకులోయ ట్రైబల్ ఆర్టిజన్ మేళా, గిరిజన ఆర్థికాభివృద్ధికి కొత్త దారులు చూపుతుందని అన్ని శాఖల అధికారుల్లో ఆశాభావం వ్యక్తమవుతోంది.




Total views : 212575