ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులు వెచ్చిస్తోంది. ఆధునిక తరగతి గదులు, డిజిటల్ బోర్డులు, కంప్యూటర్ ల్యాబ్లు, మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పిస్తోంది. అయితే కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలోని ఒక ప్రభుత్వ ఉన్నత పాఠశాల మాత్రం విద్యార్థుల లేమితో వెలవెలబోతోంది. ఒకప్పుడు ఉత్తమ ఫలితాలతో గుర్తింపు పొందిన పాఠశాలలో…. ఇప్పుడు కేవలం తొమ్మిది మంది విద్యార్థులే చదువుతున్నారు. మొత్తంగా పాఠశాలలో ఖాళీ కుర్సీలే దర్శనమిస్తున్నాయి…
ఆరవ తరగతిలో ఇద్దరు, ఏడవ తరగతిలో ఒక్కరు, ఎనిమిదవ తరగతిలో ఒక్కరు, తొమ్మిదవ తరగతిలో ఒక్కరు, పదవ తరగతిలో ముగ్గురు విద్యార్థులు మాత్రమే ఉన్నారు. కానీ ఉపాధ్యాయుల సంఖ్య మాత్రం ప్రధానోపాధ్యాయుడితో కలిపి ఎనిమిది మంది ఉన్నారు. వారిలో ఒకరు డిప్యూటేషన్పై వెళ్లినప్పటికీ, మిగిలిన ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు. పాఠశాల గ్రామానికి సుమారు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉండటంతో విద్యార్థుల హాజరు తగ్గుతోందని స్థానికులు చెబుతున్నారు.. పదిరోజుల్లో విద్యార్థులను పాఠశాలలో చేరేలా చర్యలు తీసుకుంటామని ప్రజాప్రతినిదులు అంటున్నారు. కానీ ఆ దిశగా సత్ఫలితాలొస్తాయా? లేదా? అన్న సంశయమూ లేకపోలేదు.
కాగా.. ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న వేళ, ఘన్ముక్ల ఉన్నత పాఠశాల పరిస్థితి.. గ్రామీణ విద్యావ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లకు అద్దంపడుతోంది.. సదుపాయాలు ఉన్నా విద్యార్థులు లేకపోతే పరిస్థితి ఏమిటన్న ప్రశ్న ముందుకు వస్తోంది.ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు ఈ పాఠశాలపై ప్రత్యేక దృష్టి సారించి విద్యార్థుల నమోదు పెంపుకు చర్యలు తీసుకుంటారా? లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది.




Total views : 212528