కామారెడ్డి నియోజకవర్గంపైనే రాష్ట్రం మొత్తం చర్చ జరుగుతోందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. బిక్కనూరు సభలో కేటీఆర్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఎందుకు కామారెడ్డిలో పోటీ చేస్తున్నారని చర్చ జరుగుతోందన్నిరు. కామారెడ్డి రైతుల కలలు నెరవేర్చడానికే కేసీఆర్ పోటీ చేస్తున్నారని తెలిపారు. ఈనెల 9న ఆయన నామినేషన్ వేయబోతున్నారన్నారు. నామినేషన్ రోజు వచ్చే ప్రజలను చూసి ఇతర పార్టీల వాళ్లు పోటీ చేసేందుకే భయపడాలి. బీజేపీ ఇచ్చే చాక్లెట్లకు ఆశ పడొద్దు.. బీఆర్ఎస్ ఇచ్చే బిర్యానీ తినండి అని కేటీఆర్ అన్నారు. కేసీఆర్ కొడంగల్ వచ్చి పోటీ చేయకుంటే తానే కామారెడ్డికి వస్తానని రేవంత్ సవాల్ చేశారన్నారు. ఆయన తీరు చూస్తుంటే తెగబలిసిన కోడి చికెన్ షాప్ ముందు తొడ కొట్టినట్లుగా ఉందన్నారు. పోచమ్మ గుడి ముందు పోచమ్మ గుడి ముందు పొట్టేలును కట్టేసినట్లే అన్నారు. ఉద్యమాల గడ్డ కామారెడ్డిలో ఉద్యమ నాయకుడు కేసీఆర్పై సవాల్ చేయడం అంటే అది మంచి పద్ధతి కాదన్నారు. కాంగ్రెస్ కు 55 ఏళ్లు అవకాశం ఇస్తే ఎందుకు కరెంటు, నీళ్లు ఇవ్వలేదని ప్రశ్నించారు. సభలో పలువురు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరికి పార్టీ కండువాలు కప్పి కేటీఆర్ పార్టీలోకి ఆహ్వానించారు.
Ktr
భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు వాహనాన్ని తనిఖీ చేశారు పోలీసులు. ఎన్నికల సిబ్బంది పార్టీ కార్యక్రమంలో పాల్గొనేందుకు కామారెడ్డి వెళుతున్న భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారకరామారావు వాహనాన్ని పోలీసులు ఆపారు. తూప్రాన్ వద్ద మంత్రి వాహనాన్ని ఆపడంతో.. తన వాహన తనిఖీకి పూర్తిగా సహకరించారు కేటీఆర్. తనిఖీ అనంతరం కేటీఆర్ కామారెడ్డికి బయలుదేరారు.
మల్కాజ్గిరి నియోజకవర్గం అల్వాల్ లోని ఇందిరాగాంధీ చౌరస్తా వద్ద బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్, బీజేపీకి చెందిన పలువురు కార్యకర్తలు బీఆర్ఎస్ లో చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కల్వకుంట్ల కన్నారావు హాజరయ్యారు. తెలంగాణ ఇంత అభివృద్ధి చెందిందంటే దానికి కారణం ఐటి శాఖ మంత్రి కేటీఆర్ వల్లనే అని రాజశేఖర్ రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వంలో దళిత బంధు, బీసీ బందు, కళ్యాణ లక్ష్మి , షాదీ ముబారక్ లాంటి ఎన్నో పథకాలని పేద ప్రజల కోసం అందించిన కెసిఆర్ ప్రభుత్వానికి మళ్లీ ఓటు వేసి గెలిపించాలని రాజశేఖర్ రెడ్డి కోరారు.
అవసరం తీరిన తర్వాత మర్చిపోవడం కేసీఆర్ లక్షణమని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా సోనియాగాంధీకి మాట ఇచ్చి… ఆ మాట తప్పిన విషయం తెలంగాణ ప్రజలకు తెలుసని అన్నారు. సంగారెడ్డిలో విజయభేరి సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే హాజరయ్యారు. ఈ సందర్భంగా ఖర్గే మాట్లాడుతూ… కర్ణాటకలో ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఐదు గ్యారంటీస్ అమలవుతున్నాయని… ఈ విషయంలో తెలంగాణ ప్రజలను మభ్యపెట్టేలా కేసీఆర్, కేటీఆర్ వ్యవహారిస్తున్నారని మండిపడ్డారు.. ఇందిరాగాంధీ గతంలో మెదక్ ఎంపీగా ఉన్నప్పుడు సంగారెడ్డిలో ఎన్నికల ప్రచారానికి వచ్చి హామీ ఇచ్చినట్లుగానే బీహెచ్ ఈఎల్, బీడీఎల్, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలను పెట్టారని.. ఇదీ వారు ఒక మాట ఇస్తే నెరవేర్చుకునే మంచి వ్యక్తిత్వానికి నిదర్శమన్నారు. ఇప్పుడు సోనియాగాంధీ ప్రకటించిన ఆరు గ్యారంటీలు సైతం పక్కాగా తెలంగాణలో అమలవుతాయన్నారు. రాష్ట్రం ఏర్ప డేటప్పుడు మిగులు బడ్జెట్ తొమ్మిదేళ్లలో ఉంటే అప్పుల కుప్పగా మార్చారని కేసీఆర్ పరిపాలన తీరును విమర్శించారు. అంతకు ముందు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..జగ్గారెడ్డిని సంగారెడ్డి లో50వేల అధిక్యంతో గెలిపించాలని కోరారు..జగ్గన్న.. కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించబోతున్నారు.పని మంతుడు పందిరి వేస్తె కుక్క తోక తాకి కూలిందంట. మేడిగడ్డ పరిస్థితి అట్లుంది. వీళ్లను కొరడాతో కొట్టాలి. జైల్లో వేసి చిప్ప కూడు తినిపించాలి. అని రేవంత్ రెడ్డి విమర్శించారు.
సీనియర్ నేత, మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డిని బీఆర్ఎస్ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు కలిశారు. కాంగ్రెస్ పార్టీ జనార్ధన్ రెడ్డి రాజీనామా చేసిన నేపథ్యంలో ఆయన్ను బీఆర్ఎస్లోకి ఆహ్వానించేందుకు గచ్చిబౌలిలోని నాగం నివాసం వద్దకు వెళ్లారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. మంత్రుల వెంట పలువురు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు. రాష్ట్రంలో సీనియర్ నేతగా పేరున్న ఆయనకు కాంగ్రెస్ ఎమ్మెల్యే టికెట్ కేటాయించకపోవడంతో పార్టీపై అసంతృప్తితో ఉన్నారు. ఇటీవల పార్టీలో చేరిన ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్రెడ్డి తనయుడు రాజేశ్రెడ్డికే పార్టీ అధిష్టానం టికెట్ ఖరారు చేయడంతో పార్టీ పెద్దల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తన అనుచరుల అభీష్టం మేరకు కాంగ్రెస్ పార్టీని వీడేందుకు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీకి ఆదివారం తన రాజీనామా లేఖను పంపించారు. పార్టీలో జరిగిన అవమానాలను, కాంగ్రెస్ పార్టీ తప్పుడు విధానాలను ఈ లేఖ ద్వారా తన అనుచరులకు, ప్రజలకు వివరించారు. త్వరలోనే బీఆర్ఎస్లో చేరుతున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో మంత్రులు ఆయన్ను కలవడం ఆసక్తికరంగా మారింది.
మరో నాలుగు వారాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, తెలంగాణ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం, వెంటనే ఆయన నివాసానికి మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు వెళ్లడం, ఆయనను బీఆర్ఎస్ లోకి ఆహ్వానించడం తెలిసిందే. ఆ తర్వాత మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. కేటీఆర్, హరీశ్ ల ఆహ్వానం పట్ల సానుకూలంగా స్పందించిన నాగం జనార్దన్ రెడ్డి, ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ను కలిశారు. సీఎం కేసీఆర్ తో నాగం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఇరువురు కాసేపు చర్చించుకున్నారు. ప్రగతి భవన్ కు వచ్చిన సందర్భంగా నాగంను సీఎం కేసీఆర్ ఆప్యాయంగా పలకరించారు. నాగం బీఆర్ఎస్ లో ఎప్పుడు చేరతారన్నది ఇంకా తెలియరాలేదు.
రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్న తెలంగాణకు వచ్చి కర్ణాటకలో 5 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నామని చెప్పడం హాస్యాస్పదమని కాంగ్రెస్ నేతలపై మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు. కర్ణాటక ఉపముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్ ను ఉద్దేశించి ట్వీట్ చేస్తూ పలు విమర్శలు చేశారు. కర్ణాటకలో తమ పరిస్థితి ఎలా ఉందనేది చూసేందుకు అక్కడి దాకా వెళ్లాల్సిన అవసరం లేదని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ చేతిలో దగా పడ్డ రైతులే తెలంగాణకు వచ్చి మీరు చేసిన అన్యాయాన్ని ప్రజలకు వివరిస్తున్నారని చెప్పారు. సమస్యలతో సతమతమవుతున్న కర్ణాటక రైతులను గాలికి వదిలేసి తెలంగాణలో ఓట్ల వేటకు వచ్చిన డీకే శివకుమార్ ను రెండు రాష్ట్రాల రైతులు క్షమించరని కేటీఆర్ చెప్పారు. ఐదు హామీలంటూ అరచేతిలో వైకుంఠం చూపించి, తీరా గద్దెనెక్కిన తర్వాత కొర్రీల మీద కొర్రీలు పెడుతూ ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారని కేటీఆర్ విమర్శించారు. అన్న భాగ్య స్కీమ్ అటకెక్కిందని, గృహజ్యోతి పథకం ఆరిపోయిందని ఆరోపించారు. ఎన్నికల హామీలను గాలికి వదిలేసిన కాంగ్రెస్ ను కర్ణాటక క్షమించదు.. తెలంగాణ విశ్వసించదని కేటీఆర్ స్పష్టం చేశారు. రేషన్ పై కూడా సన్నబియ్యం ఇవ్వాలన్న బీఆర్ఎస్ ప్రభుత్వ సంకల్పాన్ని, కనీసం రేషన్ బియ్యం కూడా ఇవ్వలేని కాంగ్రెస్ అసమర్థ పాలనకు మధ్య తేడాను తెలంగాణ ప్రజలు స్పష్టంగా అర్థం చేసుకున్నారని మంత్రి కేటీఆర్ చెప్పారు.
మంత్రి కేటీఆర్ తెలంగాణ ప్రజలకు కర్ణాటక మోడల్ కావాలా?, తెలంగాణ మోడల్ కావాలా అని నిర్ణయించుకోవాలని సవాల్ విసిరారు. దీంతో కాంగ్రెస్ నాయకులు వంశీ చంద్ రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి ఈ సవాల్ ను స్వీకరించి, ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్దకు చేరుకున్నారు. ఓయూలో మాట్లాడుతూ ఉద్యమాల గడ్డ ఓయూ ఆర్ట్స్ కళాశాల అన్నారు. ఈ కళాశాల నుంచి బస్ పెడతామని, అదే బస్ లో కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి కర్ణాటకకి వెళ్దడానికి సిద్ధమా అని సవాల్ విసిరారు. మంత్రి కేటీఆర్ కు ఓయూకి వచ్చి విద్యార్థులను ఎదుర్కొనే దమ్ము ఉందా చాలెంజ్ చేశారు. తెలంగాణ లో యువతకు ఉద్యోగాలు ఇచ్చామని కేటీఆర్ చెపుతున్నారని, అదే నిజమైతే బహిరంగ చర్చకు రావాలన్నారు.
సోనియాగాంధీని గతంలో రేవంత్ రెడ్డి బలిదేవత అన్నారని కేటీఆర్ గుర్తు చేశారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ కుప్పకూలిందని.. తెలంగాణలోనైనా నాలుగు సీట్లు వస్తాయని కాంగ్రెస్ పార్టీ ఆరాటపడుతోందన్నారు.మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో భాగంగా శనివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్లో మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. రాజకీయ స్వార్థం కోసం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందన్నారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారన్న ఆరోపణలు సరికాదని కేటీఆర్ అన్నారు. రుణాలు తెచ్చి ఉత్పత్తి రంగాల్లో పెట్టుబడులు పెట్టామన్నారు. రుణాల మొత్తాన్ని సాగునీటి రంగం, మిషన్ భగీరథకు వినియోగించామన్నారు. విద్యుత్ రంగంలో సంస్కరణల కోసం రుణాలు తెచ్చామన్నారు. 9 ఏళ్ల క్రితంతో పోలిస్తే తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. తలసరి ఆదాయంలో తెలంగాణ నెంబర్ వన్ గా ఉందన్నారు. తెలంగాణది సమ్మిళిత, సమగ్ర, సమీకృత మోడల్ అన్నారు. 9 ఏళ్లలో కరువు లేదు, కర్ఫ్యూ లేదన్నారు. రాష్ట్రంలో ఎలాంటి వివక్ష లేదన్నారు. పేదరికంలో దేశం నైజీరియాను దాటిపోయింది. కాంగ్రెస్ 6 గ్యారంటీలతో తెలంగాణ ప్రజలను మోసం చేసేందుకు యత్నిస్తోందన్నారు. పర్యావరణాన్ని కాపాడుతూనే పారిశ్రామికీకరణలో దూసుకుపోతున్నామన్నారు. కాంగ్రెస్ చేసిన పాపానికి తెలంగాణ 58 ఏళ్లు బాధపడిందన్నారు. 2004 నుంచి 2014 మధ్య కాంగ్రెస్ 24 వేలు ప్రభుత్వ ఉద్యోగాలను మాత్రమే ఇచ్చిందన్నారు. 2014 నుంచి ఇప్పటి వరకు లక్షా 30 వేల ఉద్యోగాలు ఇచ్చామన్నారు. 9 ఏళ్ల అభివృద్ధి ఇప్పుడు ప్రజలకు కనిపిస్తోందన్నారు. తాము ప్రజలకు ప్రగతి నివేదికలు సమర్పిస్తున్నామన్నారు. ఐటీలో హైదరాబాద్, బెంగళూరును మించిపోయిందన్నారు.
కొందరు పదవుల కోసం పార్టీలు మారుతున్నారని, కానీ ఏ పార్టీ ప్రజలకు ఏం చేసిందో ఆలోచించి ఓటేయాలని సీఎం కేసీఆర్ కోరారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఖమ్మం జిల్లా పాలేరు సభలో ప్రసంగించారు. సభలో సీఎం కేసీఆర్ తనదైన శైలిలో ప్రతిపక్ష పార్టీలపై ధ్వజమెత్తారు. సర్వజనుల సంక్షేమ కోసం పని చేసిన వారిని గెలిపించండి. బీఆర్ఎస్ వచ్చిన తర్వాతే భక్త రామదాసు ప్రాజెక్టు పూర్తి చేశామన్నారు. పాలేరును ఏ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. 3 కోట్ల టన్నుల వరిధాన్యం తెలంగాణ రైతులు పండిస్తున్నారన్నారు. పొరపాటున కాంగ్రెస్ గెలిస్తే రైతుబంధు, దళితబంధు నిలిచిపోతాయని హెచ్చరించారు. పాలేరు ప్రజలకు ఉపేందర్రెడ్డి ఉండటం అదృష్టమన్నారు. గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి మూలన కూర్చొన్న తుమ్మలను తీసుకొచ్చి మంత్రిని చేశామని గుర్తుచేశారు.తుమ్మల వల్ల పార్టీకి ఒరిగిందేమీ లేదని, ఇంకా పార్టీకి ఆయన నష్టం చేశాడన్నారు. ఉపేందర్రెడ్డిని గెలిపిస్తే పాలేరు అంతటా దళితబంధు ఇస్తామన్నారు. రేషన్కార్డుదారులందరికీ వచ్చే మార్చి నుంచి సన్నబియ్యం పంపిణీ చేస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు.