రాష్ట్రంలోని ప్రజలందరికీ కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలను ప్రభుత్వం ఉచితంగా అందించడమే లక్ష్యమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు .పెద్దపెల్లి జిల్లా గోదావరిఖనిలోని ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో 142 కోట్ల సింగరేణి నిధులతో నూతనంగా నిర్మించే ఆసుపత్రి అదనపు భవనాల నిర్మాణానికి రామగుండం ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజ్ ఠాగూర్ తో కలిసి భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ ప్రజలకు అవసరమైన అన్ని రకాల వైద్య సేవలు అందించే విధంగా సకాలంలో భవన నిర్మాణాన్ని పూర్తి చేస్తామని అన్నారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో మెడికల్ కళాశాలకు అనుసంధానంగా రాష్ట్ర ప్రభుత్వం నర్సింగ్ కళాశాలను సైతం మంజూరు చేసిందని అన్నారు. ప్రతి తెలంగాణ పౌరుడి హెల్త్ ప్రొఫైల్ రూపకల్పనకు చర్యలు తీసుకుంటామని అన్నారు.ఇప్పటి వరకు పెద్దపల్లి జిల్లాలో రాజీవ్ ఆరోగ్య శ్రీ పరిమితి పెంచిన తర్వాత సుమారుగా రెండు వేల మంది చికిత్స పొందారని అన్నారు.రామగుండం కార్పోరేషన్ పరిధిలో అవసరమైన చోట బస్తీ దవాఖానాలు ఏర్పాటుకు కృషి చేస్తామని అన్నారు.
ఎమ్మెల్యేగా ఎం.ఎస్ రాజ్ ఠాగూర్ మాట్లాడుతూ సింగరేణి కార్మికులు ,సంస్థ చొరవతో ఇక్కడ మెడికల్ కళాశాల ఏర్పాటు జరిగిందని గుర్తుచేశారు.సింగరేణి సంస్థ సహకారంతో మరింత అభివృద్ధి చేసి ప్రజలకు అవసరమైన వైద్యసేవలు అందించేందుకు కృషి చేస్తామని అన్నారు.
shridhar babu
పెద్దపెల్లి జిల్లాకు విచ్చేసిన రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబుకు సుల్తానాబాద్ లో పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణా రావు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. సుల్తానాబాద్ లోని ఆంజనేయస్వామి దేవాలయంలో మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ర్యాలీగా మంత్రి బయలుదేరారు. పెద్దపల్లిలోని కమాన్ చౌరస్తా వద్ద మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు మాట్లాడుతూ… పెద్దపల్లి జిల్లా పరిధిలో ఉన్న మంథని రామగుండం, పెద్దపల్లి,ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ప్రజలు సంపూర్ణ విశ్వాసం ఉంచి మమ్మల్ని భారీ మెజారిటీలతో గెలిపించారని,ఈ ప్రాంత అభివృద్ధికి శాయశక్తుల కృషి చేస్తామని అన్నారు. ప్రభుత్వం ఏర్పడిన రెండు రోజులలోనే రెండు గ్యారెంటీలను అమలు చేశామని, మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణం చేస్తున్నారని, రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచామని అన్నారు. పెద్దపల్లిలో భారీ మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యే పెద్దపల్లి అభివృద్ధిపై చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని, గత పది రోజులలో అనేకసార్లు పెద్దపల్లి, సుల్తానాబాద్ కు బైపాస్ రోడ్డు మంజూరు చేయాలని పెద్దపల్లికి ఆర్టీసీ బస్ డిపో మంజూరు చేయాలని కోరారని, తప్పకుండా పెద్దపల్లి జిల్లా అభివృద్ధి కోసం అవసరమైన చర్యలు తీసుకుంటామని, ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి మాట నిలబెడతామని, ఆర్టీసీ బస్సు డిపో ఏర్పాటుకు సంపూర్ణ సహకారం అందిస్తామని అన్నారు.





Total views : 62357