కుండపోత వర్షంతో తమిళనాడు అతలాకుతలం అయింది. ఆదివారం పొద్దుపోయాక ప్రారంభమైన వర్షం ఈ తెల్లవారుజాము వరకు అలుపన్నదే లేకుండా కురిసింది. ఫలితంగా కన్యాకుమారి, తిరునల్వేలి, తూత్తుకుడి, తేన్కాశి జిల్లాలకు ప్రభుత్వం రెడ్ అలెర్ట్ జారీ చేసింది. ప్రస్తుతం కొమొరిన్ ప్రాంతం, దాని పరిసర ప్రాంతాలపై తుపాను ప్రసరణ ఉందని, ఇది మధ్య-ట్రోపోస్పిరిక్ స్థాయుల వరకు విస్తరించి ఉందని వాతావరణ విభాగం తెలిపింది. కుండపోత వర్షం కారణంగా పైన పేర్కొన్న నాలుగు జిల్లాలు అతలాకుతలమయ్యాయి. పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. రైల్వే ట్రాకులపైకి నీళ్లు చేరడంతో పదుల కొద్దీ రైళ్లను రద్దు చేశారు. మరికొన్నింటిని తాత్కాలికంగా రద్దు చేశారు. భారీ వర్షంతో అప్రమత్తమైన ప్రభుత్వం ప్రభావిత నాలుగు రాష్ట్రాలకు మంత్రులను పంపింది. అధికారులు ఇప్పటికే సహాయక కార్యక్రమాలు ప్రారంభించారు.
Thoothukudi
గత కొన్ని రోజులుగా కేరళ , తమిళనాడు రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. రెండు రాష్ట్రాలతోపాటు పుదుచ్చేరిలోనూ ఎడతెరిపి లేని వర్షం పడుతోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. ప్రధాన రహదారులన్నీ నదులను తలపిస్తున్నాయి. తమిళనాడులోని చెన్నై, తూత్తుకుడి, నీలగిరి, తిరుచ్చిరపల్లి, తిరునెల్వేలి, కన్యాకుమారి, తెన్కాసి, పుదుకోట్టై, విరుదునగర్, తేని సహా పలు జిల్లాల్లో బుధవారం నుంచి ఎడతెరిపి లేని భారీ వర్షం పడుతోంది. దీంతో ఆయా జిల్లాల యంత్రాంగం విద్యా సంస్థలకు ముందుగానే సెలవు ప్రకటించింది. ఇక చెన్నైలో కురిసిన భారీ వర్షానికి ప్రధాన రహదారులన్నీ నీటమునిగాయి. దీంతో ఓ సబ్వేలో బస్సు చిక్కుకుపోయింది. పుదుచ్చేరిలోని పలు ప్రాంతాల్లో కూడా వర్షం పడుతోంది. కేరళలోనూ భారీ వర్షం కురుస్తోంది. పతనంతిట్ట, తిరువనంతపురం జిల్లాల్లో బుధవారం కురిసిన భారీ వర్షానికి పలు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. రానున్న రోజుల్లో పతనంతిట్టతోపాటు మరో రెండు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతిభారీ వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు భారీ వర్షం కారణంగా ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల వెళ్లే రహదారిపై కొండచరిలు విరిగిపడ్డాయి. దీంతో అక్కడ ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.





Total views : 78313