పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు మరింత ఉధృతమయ్యాయి. ప్రపంచ చమురు రవాణాకు గుండెకాయ వంటి హర్మూజ్ జలసంధి కేంద్రంగా అమెరికా, ఇరాన్ దేశాల మధ్య భీకర దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా ఇరాన్లోని బ్రిడ్జిలు, రవాణా మార్గాలపై అమెరికా వైమానిక దాడులను మరింత తీవ్రతరం చేసింది..బండార్ ఈ ఖామీర్ బ్రిడ్జిపై అమెరికా దళాలు జరిపిన దాడిలో ఏడుగురు మృతి చెందగా..10మందికి గాయాలయ్యాయి. మరోవైపు బండార్ అబ్బాస్ పోర్ట్ సిటీపైనా బాంబుల వర్షం కురిపించింది అగ్రరాజ్యం. ప్రతీకారంగా ఇరాన్ సైన్యం గల్ఫ్ దేశాల్లోని పలు కీలక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణుల వర్షం కురిపించింది. అమెరికా-ఇరాన్ పరస్పర దాడులతో గల్ఫ్ ప్రాంతంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి.
హర్మూజ్ జలసంధి గుండా వెళ్లే అంతర్జాతీయ వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడులు చేస్తుందనే అమెరికా ఈ చర్యకు దిగింది. ఇరాన్ మిలిటరీ రవాణాకు అత్యంత కీలకమైన పలు సముద్ర తీర వంతెనలు, మౌలిక వసతులను అమెరికా క్షిపణులు ధ్వంసం చేశాయి. ఈ దాడుల ద్వారా ఇరాన్ నౌకాదళ కదలికలను పూర్తిగా అడ్డుకోవడమే తమ వ్యూహమని పెంటగాన్ వర్గాలు స్పష్టం చేశాయి. ఇక అమెరికా దాడులపై ఇరాన్ అంతే తీవ్రంగా స్పందించింది. అమెరికాకు సహకరిస్తున్నాయనే నెపంతో పొరుగునే ఉన్న అరబ్ గల్ఫ్ దేశాలపై ఇరాన్ సైన్యం ఎదురుదాడికి దిగింది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలు, ఇంధన కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. తమ సార్వభౌమాధికారానికి భంగం కలిగిస్తే ఊరుకునేది లేదని, ఈ ప్రాంతంలో ఉన్న అమెరికా మిత్రదేశాలు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఇరాన్ విదేశాంగ శాఖ హెచ్చరించింది.
పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం అంతర్జాతీయ సమాజాన్ని తీవ్ర ఆందోళనలోకి నెట్టింది. ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే ముడిచమురులో మూడో వంతు కేవలం ఈ హర్మూజ్ జలసంధి గుండానే రవాణా అవుతుంది. ఇప్పుడు ఈ మార్గంలో యుద్ధం మొదలవడంతో చమురు రవాణా పూర్తిగా నిలిచిపోయే ప్రమాదం ఏర్పడింది. ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు ఆకాశాన్ని తాకే అవకాశం ఉందని, ఇది భారత్ సహా పలు దేశాల ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఐక్యరాజ్యసమితి అత్యవసరంగా రంగంలోకి దిగింది.




Total views : 212575