విశాఖ కేంద్రంగా కొత్త రైల్వే జోన్ ఏర్పాటుకు కీలక ముందడుగు పడింది. కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేస్తూ 2026 జూన్ 1 నుంచి సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ప్రారంభమవుతుందని ప్రకటించింది. ఈ జోన్ పరిధిలో గుంతకల్లు, గుంటూరు, విజయవాడ డివిజన్లను చేర్చింది. 2019 ఫిబ్రవరిలో ఈ జోన్ ఏర్పాటు ప్రకటన వెలువడినప్పటికీ.. అనేక కారణాలతో ఆలస్యమైంది. అనంతరం 2025 జనవరిలో డీపీఆర్కు ఆమోదం లభించగా.. అదే నెలలో జోనల్ కార్యాలయ భవన నిర్మాణానికి ప్రధాని శంకుస్థాపన చేశారు. తాజాగా గెజిట్ నోటిఫికేషన్ విడుదలతో అధికారిక కార్యకలాపాలు ప్రారంభానికి మార్గం సుగమమైంది.
జోన్ కార్యకలాపాల కోసం కీలక అధికారుల నియామకం ఇప్పటికే పూర్తయింది. ప్రిన్సిపల్ చీఫ్ మెకానికల్, ఎలక్ట్రికల్, ఇంజినీరింగ్, పర్సనల్, ఫైనాన్స్ విభాగాల్లో ఉన్నతాధికారులను నియమించారు. ఇతర డివిజన్ల నుంచి సిబ్బంది ఆప్షన్లు కోరగా.. సుమారు 3 వేల మంది విశాఖ జీఎం కార్యాలయంలో పనిచేయడానికి ఆసక్తి చూపారు. జీఎం కార్యాలయానికి దాదాపు 1200 మంది అవసరమవుతుండగా.. మొత్తం జోన్ పరిధిలో సుమారు 17 వేల మంది సిబ్బంది పనిచేయనున్నట్లు అధికారులు తెలిపారు.





Total views : 75280