జగన్ మాజీ సీపీఆర్వోగా పనిచేసిన పూడి శ్రీహరిని అరెస్ట్ చేశారు పోలీసులు. బెంగళూరులో అతన్ని అదుపులోకి తీసుకున్నారు కుప్పం పోలీసులు. సీఎం చంద్రబాబు ఫొటోల మార్ఫింగ్ కేసులో శ్రీహరికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ముందస్తు బెయిల్ మంజూరుకు నిరాకరించింది న్యాయస్థానం. మధ్యంతర ఉపశమనం సైతం కల్పించలేమని తేల్చి చెప్పింది. దీంతో శ్రీహరిని అరెస్ట్ చేశారు కుప్పం పోలీసులు.
చంద్రబాబుపై సోషల్ మీడియాల్లో అనుచిత వ్యాఖ్యలు, అభ్యంతరకర చిత్రాలను పోస్టు చేశారని.. ఆయన చేతిలో కత్తిపెట్టి చిత్రాలను సృష్టించి, వాటిని వైరల్ చేశారంటూ వైసీపీ మీడియా విభాగం ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరిపై టీడీపీ నేతల ఫిర్యాదుతో చిత్తూరు జిల్లా కుప్పం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఏప్రిల్ 15న తాడేపల్లిలో శ్రీహరిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆయనకు రిమాండ్ విధించేందుకు కుప్పం మేజిస్ట్రేట్ నిరాకరించడంతో ఆ ఉత్తర్వులను హైకోర్టులో సవాల్ చేశారు కుప్పం పోలీసులు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు..కుప్పం మేజిస్ట్రేట్ ఉత్తర్వులను సస్పెండ్ చేసింది. దీనిపై సుప్రీంకోర్టులో శ్రీహరి వేసిన పిటిషన్పై విచారణ చేపట్టిన ధర్మాసనం..ముందస్తు బెయిల్కు నిరాకరించింది. ఈ కేసుకు సంబంధించిన పిటిషన్ ఇవాళ ఏపీ హైకోర్టులో విచారణకు రానున్న నేపథ్యంలో.. తాము ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులూ జారీ చేయలేమని ధర్మాసనం తేల్చిచెప్పింది. హైకోర్టులో విచారణ పూర్తయ్యే వరకేౖనా మధ్యంతర రక్షణ కల్పించాలని కోరగా.. హైకోర్టులో ఇరుపక్షాలూ వాదనలు వినిపించుకోవచ్చని చెబుతూ తదుపరి విచారణను మే 13కు వాయిదా వేసింది సుప్రీంకోర్టు.




Total views : 61920