హైదరాబాద్ మెట్రో రైలు మొదటి దశ ప్రాజెక్టు పూర్తిగా ప్రభుత్వపరం కానుంది. ప్రైవేటు భాగస్వామ్యంతో నడుస్తున్న ఈ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఇందుకు సంబంధించి వాటా కొనుగోలు ఒప్పందంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎల్ అండ్ టీ ఛైర్మన్ ఎస్.ఎన్.సుబ్రమణ్యం సమక్షంలో సంతకాలు జరగనున్నాయి. నిన్న సీఎస్ రామకృష్ణారావు అధ్యక్షతన సమావేశమైన HMRL బోర్డు.. ఈ స్వాధీన ప్రక్రియకు ఆమోదముద్ర వేసింది. ఒప్పందంపై సంతకాల కోసం ఎల్ అండ్ టీ ఛైర్మన్ హైదరాబాద్ పర్యటన కూడా ఖరారైంది. రేపటితో గడువు ముగియనుండటంతో అధికారులు ఒప్పంద పత్రాలను సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు.
ఈ ఒప్పందం ప్రకారం ఎల్ అండ్ టీ మెట్రోరైలు లిమిటెడ్కు ఉన్న రూ.13,615 కోట్ల అప్పును ప్రభుత్వం టేకోవర్ చేస్తుంది. ఈ మొత్తాన్ని ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (IRFC) నుంచి తక్కువ వడ్డీకి రుణంగా తీసుకుని రీషెడ్యూల్ చేయనుంది. దీంతో పాటు హెచ్ఎండీఏ నుంచి రూ.1,385 కోట్లను ఈక్విటీగా ఎల్ అండ్ టీకి చెల్లించనుంది. వాస్తవానికి మార్చి 31 నాటికే ఈ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉన్నా, IRFC నుంచి రుణం మంజూరు ఆలస్యం కావడంతో గడువును ఏప్రిల్ 30కి పొడిగించారు. ఈ నేపథ్యంలో ఇవాళో..రేపో ఈ ఒప్పందంపై సంతకాలు జరిగే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. ఈ ఒప్పందంతో మెట్రో మొదటి దశలో పీపీపీ విధానం ముగిసి, అది ప్రభుత్వ ఆస్తిగా మారనుంది.





Total views : 62205