Saturday, August 15, 2026
News Navigation
Saturday, August 15, 2026
News Navigation

Breaking

Saturday, August 15, 2026
Home Andhra Pradesh మత్స్యపురిలో అక్రమ నిర్మాణాలు కూల్చివేతలు…

మత్స్యపురిలో అక్రమ నిర్మాణాలు కూల్చివేతలు…

by CVR NEWS
మత్స్యపురిలో అక్రమ నిర్మాణాలు కూల్చివేతలు

పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రభుత్వ భూముల ఆక్రమణలపై అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. వీరవాసరం మండలం మత్స్యపురి గ్రామంలో గ్రామకంఠం భూమిని ఆక్రమించి నిర్మించిన ఇళ్లను కోర్టు ఆదేశాల మేరకు కూల్చివేశారు. భారీ బందోబస్తుతో పోలీసు, రెవెన్యూ శాఖలు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. డిఎస్పి, ఎమ్మార్వోలు, ఇతర అధికారులు పర్యవేక్షణలో చర్యలు కొనసాగాయి. గతంలో వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా కేసు నమోదు అయింది. తాజగా అక్రమ కట్టడాలు కూల్చి వేయాలని కోర్టు నుంచి స్పష్టమైన ఆదేశాలు రావడంతో కూల్చివేతలు చేపట్టామని అధికారులు తెలిపారు. ప్రభుత్వ భూములను రక్షించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.

మత్స్యపురి గ్రామంలో కూల్చివేతలతో ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు ఇళ్లు లేవని, ఉన్న ఒకే ఒక్క ఇల్లును కూడా కూల్చివేశారని మహిళలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. చిన్నపిల్లలు, గర్భిణీలు, వృద్ధులు రోడ్డున పడటంతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. “ఇప్పుడు తాము ఎక్కడికి వెళ్లాలి?” అని బాధితులు ప్రశ్నిస్తున్నారు. కొంతమంది వృద్ధులు చేతులు జోడించి సహాయం కోరుతున్నారు. తలదాచుకునే చోటు కల్పించాలని, ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చకు దారి తీసింది.

ఒకవైపు కోర్టు ఆదేశాల అమలు, మరోవైపు ప్రజల ఆవేదన—మత్స్యపురి ఘటనలో రెండు కోణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అధికారులు చట్టపరంగా చర్యలు తీసుకున్నామని చెబుతుండగా, ఇళ్లు కోల్పోయిన కుటుంబాలు పునరావాసం కోసం వేడుకుంటున్నాయి. ఈ కూల్చివేతలతో పలు కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ప్రభుత్వం మానవతా కోణంలో స్పందించి ప్రత్యామ్నాయ నివాసం కల్పించాలని డిమాండ్లు పెరుగుతున్నాయి. చట్టాన్ని కాపాడడమే కాకుండా ప్రజల జీవన భద్రత కూడా ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు. ఈ ఘటనపై ప్రభుత్వ స్పందన ఎలా ఉంటుందో చూడాలి మరి .

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: