రియల్ ఎస్టేట్ చట్టం, 2016లో పొందుపరిచిన అధికారాలతో పుప్పాలగూడలోని ప్రణీత్ కాన్సెప్ట్ అంబియన్స్ ప్రాజెక్టులో అనధికారిక మార్కెటింగ్, విక్రయాలు జరుపుతున్నారన్న ఫిర్యాదులను పరిశీలించిన తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సదరు ప్రాజెక్టులోని ఏ,సీ,డీ బ్లాకులకు మాత్రమే చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్ లభించిందని, అయితే ప్రమోటర్ చట్టంలోని సెక్షన్ 3(1) ప్రకారం తప్పనిసరిగా ఉండాల్సిన రిజిస్ట్రేషన్ లేకుండానే ప్రకటనలు చేయడం చట్ట విరుద్ధమని తెలిపింది. బీ,ఈ,ఎఫ్,జీ బ్లాకులతో పాటు అదనపు అంతస్తులకు ప్రకటనలు ఇవ్వడం, మార్కెటింగ్ చేయడం, విక్రయాలకు ఆఫర్ చేయడం అథారిటీ గమనించింది. చట్టబద్ధమైన నిబంధనలను ఉల్లంఘించినందుకు సెక్షన్ 59 కింద 44 లక్షల భారీ జరిమానాను అథారిటీ విధించింది. దీంతోపాటు ప్రాజెక్టులో రిజిస్టర్ చేయబడిన భాగానికి సంబంధించి డిసెంబర్ 2024 గడువు దాటినా నిర్మాణం పూర్తి కాకపోవడాన్ని అథారిటీ గుర్తించింది. నిర్మాణ ప్రగతి నివేదిక, ప్రాజెక్ట్ నిధుల వినియోగం, అఫిడవిట్తో కూడిన సవరించిన గడువును రెండు వారాల్లోపు సమర్పించాలని ప్రమోటర్ను ఆదేశించింది. కొనుగోలుదారులందరూ స్వయంగా ‘కొనుగోలుదారుల సంఘం’ ఏర్పాటు చేసుకునే ప్రక్రియను ప్రారంభించడానికి అథారిటీ అనుమతించింది.
బాచుపల్లిలోని ఆవాస్ హైదరాబాద్ ప్రాజెక్టులో పాత యజమానుల బకాయిలను కొత్త కొనుగోలుదారులపై రుద్దడాన్ని తెలంగాణ రెరా అథారిటీ తప్పుబట్టింది. అక్రమ ఆలస్య రుసుములను తొలగించి, సవరించిన ఖాతా వివరాలను అందించాలని పసిఫికా కన్ స్ట్రక్షన్ను ఆదేశించింది. పాత కొనుగోలుదారుల బకాయిల బాధ్యతను తర్వాతి కొనుగోలుదారులపై ప్రమోటర్ వేయలేరని తేల్చి చెప్పింది. 30 రోజుల్లో ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేయాలని బాధితుడికి అనుకూలంగా కీలక తీర్పు ఇచ్చింది. సూరారంలోని ‘తులసి లేక్ ఫ్రంట్’ ప్రాజెక్టులో ఫ్లాట్ కొనుగోలు చేసిన వి.సోల్మన్ రాజుకి 30 రోజుల్లోగా రిజిస్ట్రేషన్ పూర్తి చేసి పొజీషన్ అప్పగించాలని తులసి కన్ స్ట్రక్షన్స్ మరియు భువన తేజ ఇన్ఫ్రా ప్రాజెక్టును రెరా ఆదేశించింది. బాధితుడు 2020లోనే రూ.31 లక్షల పూర్తి విక్రయ మొత్తాన్ని చెల్లించినప్పటికీ, బిల్డర్ , మార్కెటింగ్ ఏజెన్సీ మధ్య ఉన్న అంతర్గత ఆర్థిక వివాదాల వల్ల గత రెండేళ్లుగా రిజిస్ట్రేషన్ నిలిపివేశారు. బిల్డర్ మరియు ఏజెన్సీ మధ్య వివాదాలు కొనుగోలుదారుని చట్టబద్ధమైన హక్కులను ప్రభావితం చేయలేవని స్పష్టం చేసిన అథారిటీ, ఈ ఆదేశాలను పాటించకపోతే సెక్షన్ 63 ప్రకారం భారీ జరిమానాలు విధిస్తామని హెచ్చరించింది. సైదాబాద్ కాలనీలో రిజిస్ట్రేషన్ లేకుండా చేపట్టిన రాజా ఇన్ఫ్రా కన్ స్ట్రక్షన్స్ ప్రాజెక్టుపై కూడా కఠిన చర్యలకు రెరా ఆదేశాలు జారీ చేసింది.




Total views : 92164