రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డులో అమోదం తెలిపిన టూరిజం ప్రాజెక్టులు వేగంగా పూర్తి చేసేలా చూడాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేసారు. 2029 నాటికి 50 వేల హోటల్ గదుల నిర్మాణ లక్ష్యాన్ని చేరుకోవాలని సూచించారు. పర్యాటకులకు 10 వేల హోం స్టేలను కూడా అందుబాటులోకి తెచ్చేలా చూడాలని స్పష్టం చేసారు. విశాఖ, తిరుపతిలో అమ్యూజ్మెంట్ పార్కుల ఏర్పాటుకు యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని ఆదేశించారు. పర్యాటక శాఖపై సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు మంత్రి కందుల దుర్గేష్, ఏపీటీడీసీ చైర్మన్ నూకసాని బాలాజీ సహా పర్యాటక శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డులో ఆమోదం తెలియజేసిన టూరిజం ప్రాజెక్టులు వేగంగా ఏర్పాటు అయ్యేలా చూడాలని సీఎం దిశానిర్దేశం చేశారు.
రాష్ట్రంలోని వివిధ పర్యాటక ప్రాంతాలు, నగరాల్లో జాతీయ, అంతర్జాతీయ హోటల్ బ్రాండ్లు వచ్చేలా చూడాలని సూచించారు. గోదావరి పుష్కరాల నాటికి కూడా రాజమహేంద్రవరం సహా వివిధ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున హోం స్టేల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలన్నారు. హోం స్టేల నిర్వహణకు సంబంధించి రేటింగ్ కూడా పెట్టాలని దిశానిర్దేశం చేశారు. అరకు, చింతపల్లి, ముంచింగిపుట్టు, గాంధీవనం, మారేడుమిల్లి తదితర ప్రాంతాలతో పాటు కనీసం 10-15 ప్రాంతాల్లో కారావాన్ పార్కులను ఏర్పాటు చేయాలని సూచించారు. కారావాన్లను పార్కింగ్ చేసుకుని కుటుంబంతో సురక్షితంగా ప్రకృతిని ఆస్వాదించేలా ఆయా పార్కుల్లో మౌలిక సదుపాయాలను కల్పించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ఎక్స్ పీరియన్స్ కేంద్రాల వద్ద కూడా ఈ తరహా ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు.
తిరుపతి, విశాఖలలో అమ్యూజ్ మెంట్ పార్కుల ఏర్పాటుకు యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని సీఎం సూచనలు జారీ చేశారు. అటవీ, దేవాదాయ శాఖల సమన్వయంతో ఎకో, టెంపుల్ టూరిజానికి ప్రోత్సాహం ఇచ్చేలా ప్రాజెక్టులు చేపట్టాలని సీఎం పేర్కొన్నారు. ప్రసాద్, స్వదేశ్ దర్శన్ పథకాల కింద వివిధ దేవాలయాలు, దర్శనీయ స్థలాల అభివృద్ధికి చేపట్టిన ప్రాజెక్టులను 2026 మే నాటికి సిద్ధం చేయాలని అన్నారు. దీనికి సంబంధించి మరో రూ.663 కోట్లతో కేంద్రానికి ప్రతిపాదనలు పంపినట్టు పర్యాటక శాఖ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. గండికోట, సూర్యలంక, అరకు బొర్రా గుహలు తదితర ప్రాంతాలను ప్రముఖ పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు అవసరమైన కార్యాచరణ చేపట్టాలన్నారు. గోదావరి పుష్కరఘాట్ను ఆగస్టు నాటికి, హావ్ లాక్ బ్రిడ్జిపైకి పర్యాటకులను అనుమతించేలా ఈ ఏడాది డిసెంబరు నాటికి పనులు పూర్తి చేయాలని సీఎం స్పష్టం చేశారు.





Total views : 77598