విజయవాడలోని డాక్టర్ నోరి రామశాస్త్రి ప్రభుత్వ ఆయుర్వేద కళాశాలలో లైంగిక వేధింపుల వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. కామాంధుడైన ఓ ప్రొఫెసర్ తమను వేధిస్తున్నాడంటూ విద్యార్థినులు రాష్ట్ర మహిళా కమిషన్ను ఆశ్రయించారు. ఈ ఫిర్యాదుపై మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ నేరుగా కళాశాలలో పర్యటించి, బాధితులతో విడివిడిగా మాట్లాడారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హామీ ఇచ్చారు.
విజయవాడ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాలలో విద్యాబుద్ధులు చెప్పాల్సిన ప్రొఫెసరే కీచకుడిగా మారడం చర్చనీయాంశమైంది.
తమను లైంగికంగా వేధిస్తున్నారంటూ విద్యార్థినులు పంపిన ఈ-మెయిల్ ఆధారంగా మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ కళాశాలలో విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థినులు పడుతున్న ఇబ్బందులను ఆమె స్వయంగా అడిగి తెలుసుకున్నారు. గత మార్చిలోనే అంతర్గత విచారణ జరిగినప్పటికీ, ఫిర్యాదు చేసిన విద్యార్థినులనే టార్గెట్ చేయడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడిన రాయపాటి శైలజ.. పరీక్షల విషయంలో ఇబ్బందులు పెడతారనే భయంతో విద్యార్థినులు బయటకు రావడం లేదని, వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని భరోసా ఇచ్చారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రొఫెసర్ను కూడా విచారించామని, నివేదిక ఆధారంగా కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న వేధింపులను అరికట్టేందుకు ప్రతి జిల్లాలో సమీక్షలు నిర్వహిస్తున్నామని, బాధితులు సులభంగా ఫిర్యాదు చేసేందుకు త్వరలో క్యూఆర్ కోడ్ వ్యవస్థను అందుబాటులోకి తెస్తున్నామని ఆమె వెల్లడించారు.