తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అంచనాలను తారుమారు చేసి ఘన విజయం సాధించిన టీవీకే పార్టీ, ప్రస్తుతం గవర్నమెంట్ ఏర్పాటుకు సిద్ధమౌవుతున్న వేళ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. మ్యాజిక్ ఫిగర్ 118 సంఖ్యాబలం లేక.. గవర్నర్ అనుమతి నిరాకరించడంతో విజయ్ నేటి ప్రమాణస్వీకారం రద్దయ్యింది. టీవీకే పార్టీ అధినేత, ప్రముఖ సినీ నటుడు విజయ్ చెన్నైలోని లోక్ భవన్లో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ను కలిశారు. అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకున్న టీవీకే ను.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ గవర్నర్ కార్యాలయం విజయ్కి ఆహ్వానం పంపించింది. తనకు మద్దతిచ్చే జాబితాతో కూడిన లేఖను గవర్నర్కు అందజేశారు. కానీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైన టీవీకే అధినేత విజయ్కు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ నుంచి ప్రతికూల స్పందన ఎదురైనట్లు తెలుస్తోంది. రాజ్భవన్లో గవర్నర్ను కలిసిన విజయ్కు, సంఖ్యాబలం విషయంలో స్పష్టమైన నిబంధనలను గవర్నర్ గుర్తుచేశారు. తగినంత మెజారిటీ లేనిదే ప్రభుత్వం ఏర్పాటుకు అనుమతి ఇవ్వలేమని గవర్నర్ స్పష్టం చేయడంతో తమిళనాడులో సస్పెన్స్ కు తెరలేపింది.
ప్రభుత్వ ఏర్పాటుకు కావలసిన మ్యాజిక్ ఫిగర్ 118. అయితే ప్రస్తుత సమీకరణాల ప్రకారం టీవీకే బలం 108 సీట్లు.. విజయ్ రెండు చోట్లా గెలవడంతో ఒక సీటుకు రాజీనామా చేయాల్సి ఉంటుంది. కాబట్టి నికరంగా 107 సీట్లు . మద్దతు ఇస్తున్న కాంగ్రెస్ బలం 5 సీట్లు. దీంతో మొత్తం బలం 112 అవుతుంది. ఈ క్రమంలో విజయ్ పార్టీకి మరో 6 మంది ఎమ్మెల్యేల అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే టీవీకేకు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని తెలిసింది. కాగా… కాంగ్రెస్తో పాటు మరికొన్ని చిన్న పార్టీలు తమకు మద్దతు ఇస్తున్నాయని, ప్రమాణస్వీకారం తర్వాత అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకుంటానని విజయ్ గవర్నర్ కు వివరించారు. అయితే, ముందే 118 మంది సభ్యుల సంతకాలతో కూడిన మద్దతు లేఖ ఉంటేనే ఆహ్వానిస్తామని గవర్నర్ స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. కాగా…అన్నాడీఎంకే పార్టీకి ఉన్న 47 మంది ఎమ్మెల్యేలలో సీవీ షణ్ముగం నేతృత్వంలోని ఒక వర్గం.. సుమారు 35 మంది విజయ్కు మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు, పీఎంకే (4), ఐయూఎంఎల్ (2), సీపీఐ (2), సీపీఎం (2) వంటి పార్టీల మద్దతు కూడగట్టడంపై టీవీకే నేతలు చర్చలు జరుపుతున్నారు.
తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటుకు మెజారిటీ సాధించడానికి టీవీకే పార్టీకి10 సీట్లు అవసరమయ్యాయి. ఇప్పటికే టీవీకే కు కాంగ్రెస్ మద్దతు తెలుపగా, అన్నాడీఎంకేకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు కూడా అందుకు రెడీగా ఉన్నట్లు తెలిసింది. టీవీకేతో పొత్తు పెట్టుకునే విషయంపై తమ పార్టీయే తుది నిర్ణయం తీసుకుంటుందని సీవీ షణ్ముగం స్పష్టం చేశారు. ఏఐఏడీఎంకే అధికార ప్రతినిధి సత్యన్ కూడా స్పందించారు. పార్టీలో విభేదాలు, చీలికలు లేవని స్పష్టం చేశారు. అలాగే, ఏఐఏడీఎంకే, టీవీకే వర్గాల మధ్య సఖ్యత మొదలైందన్నారు. హైకమాండ్ నిర్ణయం కోసం వేచి ఉండాలని చెప్పారు. . ఇదిలా ఉండగా, పొత్తును కుదుర్చుకునే ప్రయత్నంలో భాగంగా టీవీకే పార్టీ ప్రధాన కార్యదర్శి ఎన్. ఆనంద్ ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె. పళనిస్వామితో సమావేశమయ్యారు. కాంగ్రెస్.. తన మిత్రపక్షాలైన వీసీకే, వామపక్ష పార్టీలను కూడా కలుపుకొని వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కానీ..ప్రస్తుతానికి ఈ 6 మంది ఎమ్మెల్యేల కొరత తీరితే తప్ప.. విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసే అవకాశం లేదు? తదుపరి ఆదేశాలు వచ్చే వరకూ టీవీకే ఎమ్మెల్యేలు రిసార్ట్ లోకి వెళ్లాలని విజయ్ ఆదేశించడంతో తమిళనాట రాజకీయాలు మరోసారి వేడెక్కాయి..




Total views : 75026