33 ఏళ్ల క్రితం జరిగిన ఓ హత్యాయత్నం కేసులో సంచలన తీర్పు వెలువడింది. విచారణ సాగుతూ సాగుతూ మూడు దశాబ్దాలు దాటిన తర్వాత.. 84 ఏళ్ల వృద్ధుడిని కోర్టు దోషిగా తేల్చింది. ప్రస్తుతం సరిగా నడవలేని స్థితిలో ఉన్న ఆ వృద్ధుడికి కోర్టు ఎలాంటి శిక్ష విధిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీస్తోంది. 1992 నవంబర్ 10న వైశాలి జిల్లాలోని రాఘవ్పూర్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. దీప్ రాయ్ కుటుంబ సభ్యులు అదాలత్ రాయ్ ఇంటి సమీపంలోని రోడ్డుపై గాజు పెంకులు వేయడంతో వివాదం చెలరేగింది. దీనిపై ప్రశ్నించిన అదాలత్ రాయ్, ఆయన భార్య రామ్శకీ దేవిపై దీప్ రాయ్ కుటుంబం దాడికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 1993 మార్చిలో ఛార్జ్షీట్ దాఖలు చేయగా, 1999లో కోర్టు అభియోగాలు నమోదు చేసింది. అప్పటి నుంచి దాదాపు 30 ఏళ్లపాటు కేసు విచారణ కొనసాగింది. ఈ క్రమంలో నిందితుల్లో నలుగురు మరణించారు. కోర్టు మొత్తం పది మంది సాక్షులను విచారించింది.
అన్ని ఆధారాలను పరిశీలించిన అనంతరం కోర్టు తుది తీర్పును వెలువరించి, 84 ఏళ్ల దీప్ రాయ్ను దోషిగా నిర్ధారించింది. శిక్ష ఖరారు కోసం విచారణను జూన్ 2కి వాయిదా వేసింది. ప్రస్తుతం వృద్ధాప్యంతో ఇబ్బందులు పడుతున్న దీప్ రాయ్కు కోర్టు ఎలాంటి శిక్ష విధిస్తుందనే అంశం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో కూడా ఈ కేసుపై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.
33 ఏళ్ల తర్వాత హత్యాయత్నం కేసులో తీర్పు..
30
previous post


Total views : 92039