హనుమకొండ జిల్లాలో లగ్జరీ కార్లలో తిరుగుతూ వడ్ల బస్తాలను దొంగిలిస్తున్న ఒక విచిత్రమైన దొంగల ముఠా గుట్టును రట్టు చేశారు శాయంపేట పోలీసులు . బీటెక్ విద్యార్థులు, మైనర్ బాలురు కలిసి జల్సాల కోసం దొంగతనాలకు అలవాటు పడటం స్థానికంగా తీవ్ర సంచలనం రేకెత్తిస్తోంది. హనుమకొండ జిల్లాలోని శాయంపేట, దామెర, ఐనవోలు, కమలాపూర్, హసన్ పర్తి మండలాల్లోని వడ్ల కళ్ళాల్లో గత కొంతకాలంగా వరుస దొంగతనాలు జరుగుతున్నాయి. రాత్రి వేళల్లో టాటా హారియర్, బ్రెజ్జా వంటి లగ్జరీ కార్లలో వస్తున్న ఈ ముఠా.. కళ్ళాల్లోని వడ్ల బస్తాలను ఎత్తుకెళ్తోంది. ఈ వరుస చోరీలపై నిఘా పెట్టిన శాయంపేట పోలీసులు కొప్పుల బ్రిడ్జ్ సమీపంలో ఈ ముఠాను చాకచక్యంగా పట్టుకున్నారు.నిందితులు మొత్తం 7 కేసుల్లో 135 క్వింటాళ్ల బరువుగల 242 వడ్ల బస్తాలను దొంగిలించినట్లు ఒప్పుకున్నారు. అలా దొంగిలించిన వడ్లను గొర్రెకుంటలోని గణేష్ రైస్ మిల్లులో విక్రయించినట్లు విచారణలో తేలింది. నిందితుల నుంచి పోలీసులు రూ. 3,05,200 నగదుతో పాటు, దొంగతనాలకు ఉపయోగించిన టాటా హారియర్, బ్రెజ్జా కార్లను సీజ్ చేశారు.
హనుమకొండ జిల్లాలో లగ్జరీ కార్లలో వడ్ల బస్తాలు దొంగిలిస్తున్న ముఠా అరెస్ట్.
147