పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం తూర్పు తాళ్ల గ్రామంలో నిత్యం జరుగుతున్న విద్యుత్ కోతలకు నిరసనగా గ్రామస్తులు కొవ్వొత్తులతో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు.
తూర్పు తాళ్ల సెంటర్ నుంచి విద్యుత్ సబ్స్టేషన్ వరకు కొవ్వొత్తులు చేతబట్టి ర్యాలీ చేపట్టిన గ్రామస్తులు, ప్రతిరోజూ రాత్రి వేళల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
విద్యార్థుల చదువులు, వృద్ధులు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, తరచూ విద్యుత్ అంతరాయాలతో ప్రజలు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని తెలిపారు.
అధికారులు వెంటనే స్పందించి విద్యుత్ కోతలను అరికట్టి నిరంతర విద్యుత్ సరఫరా అందించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారం కాకపోతే తమ ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.