సిద్దిపేట జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొమురవెల్లిలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. కొమురవెల్లి రైల్వే హల్ట్ స్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమం ముగిసిన అనంతరం బీజేపీ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణ వాతావరణాన్ని వేడెక్కించింది. రైల్వే హల్ట్ స్టేషన్ ప్రారంభోత్సవం పూర్తయిన వెంటనే అక్కడకు భారీగా చేరుకున్న బీజేపీ శ్రేణులు తమ పార్టీకి అనుకూలంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అధికారిక కార్యక్రమంలో రాజకీయ నినాదాలు చేయవద్దంటూ అక్కడే ఉన్న పోలీసులు వారిని వారించారు. పోలీసులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. పరిస్థితి చెయ్యి దాటిపోతుండటంతో బీజేపీ కార్యకర్తలను చెదరగొట్టేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. ఈ క్రమంలో పోలీసులు, బీజేపీ నేతల మధ్య తీవ్ర తోపులాట జరిగింది. పోలీసులు తమపై భౌతిక దాడికి దిగారని, చేయి చేసుకున్నారని బీజేపీ కార్యకర్తలు తీవ్రంగా ఆరోపించారు. కొద్దిసేపు తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొనడంతో ప్రయాణికులు, స్థానికులు ఆందోళనకు గురయ్యారు. చివరకు పోలీసులు అదనపు బలగాలతో రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
సిద్దిపేట జిల్లా కొమురవెల్లిలో ఉద్రిక్తత.
41