భారత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు సెప్టెంబర్ 12, 13 తేదీల్లో న్యూఢిల్లీలో జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన భారత్ మండపంలో ఈ సదస్సు నిర్వహించనున్నారు. 2026 సంవత్సరానికి బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలను భారత్ చేపట్టడంతో దేశ రాజధానిలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. విస్తరించిన బ్రిక్స్ కూటమిలోని 11 దేశాల అగ్రనేతలు ఈ సమావేశాలకు హాజరుకానున్నారు.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా సహా పలువురు నేతలు సదస్సుకు రానున్నారు. ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ కూడా హాజరుకానున్నారు. ముఖ్యంగా మోదీ–షీ జిన్పింగ్, మోదీ–పుతిన్ ద్వైపాక్షిక భేటీలపై ప్రపంచ దేశాల దృష్టి నెలకొంది. గ్లోబల్ సౌత్ ఆర్థిక హక్కులు, వాణిజ్యం, గ్లోబల్ గవర్నెన్స్, ఇంధన భద్రత, సరఫరా గొలుసులు వంటి అంశాలపై చర్చించనున్నారు. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో చమురు, అంతర్జాతీయ వాణిజ్యంపై ప్రభావం కూడా కీలకంగా మారనుంది. విదేశీ అతిథుల కోసం చిరుధాన్యాలతో భారతీయ సంప్రదాయ వంటకాలతో ప్రత్యేక మెనూ సిద్ధం చేశారు. సదస్సు నేపథ్యంలో ఢిల్లీలో ట్రాఫిక్ ఆంక్షలు, భద్రతా చర్యలు కట్టుదిట్టం చేశారు.