ప్రముఖ రియల్టర్, హోమ్ల్యాండ్ అధినేత బాణాల రాంరెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం నేదునూరులోని తన ఫాంహౌస్లో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. పటాన్చెరులో 280 ఎకరాల్లో వెంచర్ అభివృద్ధి చేస్తున్న రాంరెడ్డి.. స్థానిక నేతలు, పలువురి ఒత్తిళ్లతో తీవ్ర మనస్తాపానికి గురైనట్లు సమాచారం. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
2018లో పటాన్చెరువు ప్రాంతంలో సుమారు 280 ఎకరాల భూమిని డెవలప్మెంట్ కోసం తీసుకుని వెంచర్ చేపట్టారు. అయితే భూమికి సంబంధించిన వివాదాలు, కోర్టు లిటిగేషన్ల కారణంగా వెంచర్ అభివృద్ధి ఆలస్యమైనట్లు తెలుస్తోంది. వివాదాల పరిష్కారం కోసం భారీగా అప్పులు చేయడంతో పాటు.. భూ యజమానులతోనూ సమస్యలు తలెత్తినట్లు సమాచారం. వెంచర్ ఆలస్యం కావడంతో ఆర్థిక భారం పెరిగి తీవ్ర ఒత్తిడికి గురైనట్లు తెలుస్తోంది.
రాంరెడ్డి రాసినట్లుగా భావిస్తున్న సూసైడ్ నోట్ను కందుకూరు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దాని ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతోంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. రాంరెడ్డి ఆత్మహత్యకు అసలు కారణాలు, ఆయనపై ఎవరైనా ఒత్తిడి తెచ్చారా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.