తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అనలాగ్, నాన్ డెయిరీ, ఆర్టిఫిషియల్ పనీర్పై ఏడాది పాటు నిషేధం విధించింది. ప్రజారోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీజీ సేఫ్ వెల్లడించింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా నిషేధం అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది.
పనీర్ పేరుతో అనలాగ్, నాన్ డెయిరీ, ఆర్టిఫిషియల్ ఉత్పత్తుల తయారీపై టీజీ సేఫ్ నిషేధం విధించింది. తయారీతో పాటు ప్రాసెసింగ్, ప్యాకింగ్, నిల్వ, పంపిణీ, రవాణా, విక్రయాలపైనా ఆంక్షలు అమలు చేయనున్నట్లు తెలిపింది. ప్రజలకు నాణ్యమైన, సురక్షితమైన ఆహారం అందించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.
సెప్టెంబర్ 10వ తేదీ నుంచే నిషేధం అమల్లోకి వచ్చినట్లు టీజీ సేఫ్ వెల్లడించింది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్-2006లోని సెక్షన్ 30(2)(a) కింద ఈ ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపింది. ఏడాది పాటు రాష్ట్రవ్యాప్తంగా ఈ నిషేధం కొనసాగనుంది. ఆర్టిఫిషియల్ పనీర్ విక్రయాలు, సరఫరాపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉండటంతో వ్యాపార వర్గాల్లోనూ ఈ నిర్ణయం చర్చనీయాంశంగా మారింది.