అక్టోబర్ 29వ తేదీ తెల్లవారుజామున 1:05 చంద్రగ్రహణం ఏర్పడి తెల్లవారుజామున 2:22 గంటల మధ్య పాక్షిక చంద్రగ్రహణం పూర్తవుతుంది. కాబట్టి అక్టోబర్ 28న రాత్రి గ్రహణ సమయానికి 6 గంటల ముందుగా ఆలయం తలుపులు మూసివేయడం ఆనవాయితీ. అక్టోబర్ 29వ తేదీ తెల్లవారుజామున జరుగనున్న పాక్షిక చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయం అక్టోబర్ 28 రాత్రి 7:05ని.లకు ఆలయ తలుపులు మూసివేసి తిరిగి అక్టోబరు 29వ తేదీ తెల్లవారుజామున 3:15 గంటలకు ఏకాంతంలో శుద్ధి, సుప్రభాత సేవ నిర్వహించి ఆలయ తలుపులు తెరుస్తారు. చంద్రగ్రహణం కారణంగా ఎనిమిది గంటల పాటు ఆలయ తలుపులు మూసి ఉంటాయి. ఈ కారణంగా సహస్ర దీపాలంకార సేవ, వికలాంగులు మరియు వయోవృద్ధుల దర్శనం అక్టోబర్ 28న రద్దు చేశారు.
Andhra Pradesh
పల్నాడు జిల్లా పెదకూరపాడు,అచ్చంపేట, క్రోసూరులలో పంటపొలాలను సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు, పలువురు రైతు నాయకులు పరిశీలించారు. రాష్ట్ర వ్యాప్తంగా 18 జిల్లాల్లో తీవ్రవర్షాభావ పరిస్థితులున్నాయి .. 122 యేళ్ళ క్రితం ఇదేవిధంగా వర్షాభావం ఏర్పడింది పొలాల్లో పంటలు దెబ్బతిన్నాయి,దాంతో రైతాంగం తీవ్రంగా నష్టపోయింది.. ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన కల్పించి , రైతాంగానికి వెంటనే సాగునీరు అందించి, తొమ్మిది గంటలు వ్యవసాయ విద్యుత్ సరఫరా చేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగాన్ని ఆదుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు డిమాండ్ చేశారు .
చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ శ్రీకాకుళం నుంచి కుప్పం వరకూ సైకిల్ యాత్ర చేస్తున్న టీడీపీ కార్యకర్తపై పుంగనూరులో వైసీపీ నాయకుడు రెచ్చిపోయిన ఘటనపై నారా భువనేశ్వరి స్పందించారు. పుంగనూరు ఘటన పెత్తందారీ పోకడలకు నిదర్శనమని ఆమె ఆగ్రహాం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రౌడీ రాజకీయానికి ఈ దాడి ఒక ఉదాహరణ అని అన్నారు. పేదలపై పెత్తందారీ పోకడలకు నిదర్శనమన్నారు. తెలుగుదేశం అంటే ఒక కుటుంబమని, మా నేతలను అక్రమంగా జైలులో పెట్టారని నిరసన కూడా చేయకూడదా? అని ఆమె ప్రశ్నించారు. కార్యకర్తలకు సైకిల్ యాత్ర చేసే హక్కు కూడా లేదా? అని నిలదీశారు. ఎల్లకాలం నియంతల పెత్తనం సాగదు. అంతిమ విజయం ప్రజాస్వామ్యానిదే అని భువనేశ్వరి అన్నారు.
రూ.2 వేల నోటు చలామణిని నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోట్లను మార్చుకునేందుకు సెప్టెంబర్ 30 వరకు గడువు ఇచ్చింది. మరో రెండు రోజుల్లో గడువు ముగియనుండడంతో మార్కెట్లో రూ.2 వేల నోటును వ్యాపారులు తీసుకోవడంలేదు. పెద్ద నోటు ఇస్తే చిల్లర లేదంటూ వద్దంటున్నారని పలువురు చెబుతున్నారు. మార్కెట్లో మాత్రమే కాదు ప్రభుత్వ సంస్థలలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. తమిళనాడు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కూడా పెద్ద నోట్లు తీసుకోవద్దంటూ కండక్టర్లు, డ్రైవర్లకు ఆదేశాలు జారీ చేసింది. గురువారం నుంచి రూ.2 వేల నోటును అంగీకరించ వద్దని చెప్పింది. నోట్ల మార్పిడికి గడువు దగ్గర పడడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
2016 నవంబర్ 8న రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ప్రత్యామ్నాయంగా రూ.500 కొత్త నోట్లను, రూ.2 వేల నోటును తీసుకురానున్నట్లు చెప్పారు. పాత నోట్ల రద్దు తర్వాత ఆర్బీఐ మార్కెట్లోకి విడుదల చేసిన రూ. 2 వేల నోటు తాత్కాలిక సౌలభ్యం కోసమేననే అభిప్రాయాలు అప్పట్లోనే వ్యక్తమయ్యాయి. దీనికి బలం చేకూర్చేలా 2019లో రూ.2 వేల నోట్ల ముద్రణను ఆర్బీఐ నిలిపి వేసింది. ఇటీవల ఈ నోటును చలామణిలో నుంచి తప్పిస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది.
నెల్లూరు జిల్లా రాపూరు మండలం తెగచర్ల గ్రామ సమీపంలో అక్రమ రవాణాకు సిద్ధంగా ఉన్న 17 ఎర్ర చందనం దుంగలు, కారు,రెండు బైకులు,తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్టు రాపూరు అటవీ శాఖ రేంజర్ రవీంద్రబాబు తెలిపారు.ఆయన మాట్లాడుతూ జిల్లా అటవీశాఖ అధికారి ఆవుల చంద్రశేఖర్ సూచనల మేరకు అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు అటవీ ప్రాంతం నుంచి ఎర్రచందనం చెట్లు నరికి,నెల్లూరు జిల్లా రాపూరు మండలం తెగచెర్ల అటవీ ప్రాంతంలో డంప్ చేసి అక్కడ నుంచి కారు లో రవాణా చేసేందుకు సిద్ధంచేయగా అటవీశాఖ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు.
జైల్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏదైనా జరిగితే సీఎం జగన్దే బాధ్యతని మాజీ మంత్రి, సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. పురుగు మందు డబ్బా తీసుకొని ఎన్టీఆర్ ఘాట్ వద్దకు ఆయన ఇవాళ వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మోత్కుపల్లి మాట్లాడారు. చంద్రబాబు ఆరోగ్యాన్ని దెబ్బతీసి చంపాలని చూస్తున్నారు. ఆయన్ను హింసించి బాధపెడుతున్నారు. జగన్ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నా. రాజధాని లేని రాష్ట్రాన్ని పాలిస్తున్న ఏకైక సీఎం.. జగన్. చంద్రబాబు కుటుంబానికి భద్రత లేదు. ఏపీలో పేద ప్రజలు బతికే పరిస్థితి లేకుండా చేశారు. చంద్రబాబును బయటకు రాకుండా చేసి ఓట్లను సాధించాలని ప్రయత్నమా? ఎన్నికల్లో డబ్బులు ఇచ్చి జగన్ మళ్లీ గెలవాలని చూస్తున్నారు అని మోత్కుపల్లి మండిపడ్డారు.
కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే బసన్ గౌడ పాటిల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతదేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ కాదని, సుభాష్ చంద్రబోస్ అని అన్నారు. కర్ణాటకలో నిర్వహించిన ఓ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ… మన దేశానికి నెహ్రూ తొలి ప్రధాని కాదని, సుభాష్ చంద్రబోస్ ప్రథమ ప్రధాని అన్నారు. నేతాజీ బ్రిటిష్ వారికి భయం రుచిచూపించడం వల్ల వాళ్లు దేశాన్ని విడిచి వెళ్లిపోయారన్నారు. భారతీయులు చేసే నిరాహార దీక్షల వల్ల లేదా సత్యం, ధర్మం అంటూ ఒక చెంపపై దెబ్బ కొడితే మరో చెంప చూపించడం వల్ల కానీ స్వాతంత్ర్యం రాలేదన్నారు.
తెలంగాణపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీలే ద్వేషాన్ని ప్రదర్శిస్తున్నాయని మంత్రి హరీశ్ రావు విమర్శించారు. ఆ పార్టీల బోగస్ మాటలు విని రాష్ట్ర ప్రజలు ఆగం కావొద్దని చెప్పారు. తెలంగాణపై వివక్ష చూపడంలో కాంగ్రెస్ ఏ1, బీజేపీ ఏ2 అని అన్నారు. మనం వెనుకబడటానికి కారణం కూడా ఈ రెండు పార్టీలేనని చెప్పారు. రానున్న ఎన్నికల్లో కేసీఆర్ ను గద్దె దించాలనే కుట్రలు జరుగుతున్నాయని, బీఆర్ఎస్ ప్రభుత్వంపై అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కర్ణాటకలో కరెంట్ కూడా ఇవ్వలేని స్థితిలో అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం ఉందనే విషయాన్ని ప్రజలు గుర్తించాని చెప్పారు. తెలంగాణలో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా జరుగుతోందని అన్నారు.
రాజకీయ లబ్ధి కోసం అంగన్ వాడీ కార్యకర్తలను విపక్షాలు రెచ్చగొడుతున్నాయని హరీశ్ మండిపడ్డారు. బీజేపీ లేదా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో లేని విధంగా అంగన్ వాడీలకు కేసీఆర్ ప్రభుత్వం ఎక్కువ వేతనాలను చెల్లిస్తోందని చెప్పారు. త్వరలోనే పే రివిజన్ కమిషన్ ఏర్పాటు చేసి… ప్రభుత్వ ఉద్యోగులతో పాటు అంగన్ వాడీ, ఆశా వర్కర్ల జీతాలను పెంచుతామని హామీ ఇచ్చారు. తెలంగాణపై వివక్ష చూపుతున్న ప్రధాని మోదీ ఇక్కడకు ఎందుకు వస్తున్నారని ప్రశ్నించారు. తెలంగాణకు కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు.
భక్తుల కానుకలు, ముడుపులతో టిటిడి ఖజనా నింపుకుంటున్న పాలక మండలి నిర్ణయం సరైనది కాదు అన్నారు బిజేపి అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన మాట్లాడుతూ టిటిడి నిధుల్ని తిరుపతి అభివృద్ధి కోసం మున్సిపాలిటీ మళ్ళించడంను వ్యతిరేకిస్తున్నాం.. ఈ నిర్ణయంపై విశ్వహిందూ పరిషత్ వ్యతిరేకిస్తూ అన్ని కలెక్టర్ కార్యాలయాల ముందు నిరసన తెలియజేస్తున్నాం.. టిటిడి నిధుల్లో ఒక్కశాతం అంటే, ఏడాదికి యాభై కోట్లు, శానిటరీ పేరుతో మరో యాభై కోట్లు దారి మళ్ళించేందుకు ప్రయత్నం చేస్తున్నారు.. రాష్ట్ర ప్రభుత్వం టిటిడి నిధులను తిరుపతి మున్సిపాలిటీ మళ్ళించడం లేదంటూ ఉత్తర్వులు జారీ చేయడం సంతోషం.. స్వార్ధ రాజకీయాలు,స్వార్ధ ప్రయోజనాల కోసం ఎవరినో దృష్టిలో పెట్టుకుని టిటిడి నిధులను దారి మళ్ళించేందుకు ప్రయత్నించారు.. ఇలాంటి నిర్ణయం తీసుకుంటే శ్రీవారి భక్తుల ఆగ్రహంకు గురి కాక తప్పదన్నారు భానుప్రకాష్ రెడ్డి.
టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబును స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్ట్ చేయడం, నిరసనలు, తదితర పరిణామాలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. చంద్రబాబు ఏపీలో అరెస్ట్ అయితే హైదరాబాదులో నిరసలేంటని మంత్రి కేటీఆర్ అసంతృప్తి వ్యక్తం చేయడం, కేటీఆర్ వ్యాఖ్యలను రేవంత్ రెడ్డి తప్పుబట్టడం వంటి అంశాలపైనా కవిత తన అభిప్రాయాలను పంచుకున్నారు.
పక్క రాష్ట్రంలోని రాజకీయాలపై ఉన్న శ్రద్ధ వారికి ఇక్కడి రాజకీయాలపై లేకపోవడం శోచనీయం అని రేవంత్ పై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ దేశం మొత్తానికి రాజధాని కాబట్టి అక్కడ ధర్నాలు చేసుకుంటే ఎవరికీ అభ్యంతరం ఉండదని కవిత పేర్కొన్నారు. హైదరాబాదులో ధర్నా చేయాలంటే తెలంగాణ అంశాలపై ధర్నా చేస్తే బాగుంటుందని హితవు పలికారు.
ఆంధ్రా అంశాలపై ఇక్కడెందుకు ధర్నాలు చేయాలి? అలాంటి కార్యక్రమాలతో హైదరాబాదులో శాంతిభద్రతలకు భంగం వాటిల్లదా? అని మాత్రమే తమ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారని కవిత స్పష్టం చేశారు. దాన్ని పెద్ద వివాదం చేస్తున్నారని, ఎవరైనా ఎక్కడికైనా రావొచ్చు అంటూ రేవంత్ రెడ్డి అనవసరంగా భావోద్వేగాలు రెచ్చగొడుతున్నారని ఆరోపించారు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పరిస్థితులు ఇలాగే ఉంటాయని, ఎప్పుడూ ధర్నాలు, గొడవలు, నిరసనలు, కర్ఫ్యూలు ఉంటాయని, ఆ పార్టీ చరిత్ర అదేనని కవిత ఎద్దేవా చేశారు. పరిస్థితులను బట్టి ప్రజలను రెచ్చగొట్టి ఓట్లు రాబట్టుకోవాలనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని కవిత విమర్శించారు.
చంద్రబాబు అరెస్ట్ అంశంపైనా కవిత తన అభిప్రాయాలను స్పష్టం చేశారు. “ఒక రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై పక్క రాష్ట్రంలో చర్చ పెట్టాలనుకోవడం దారుణం. దేశంలో అనేక మంది రాజకీయ నేతలు వేధింపులకు గురవుతుండడడం చూస్తూనే ఉన్నాం. ఇది ఆయా పార్టీలు, వారి న్యాయ విభాగాలు చూసుకోవాల్సిన విషయం. తమ సమస్యను ప్రజల సమస్యగా చెబుతూ ప్రతి ఒక్కరినీ ఏదో ఒక విధంగా టార్గెట్ చేయాలని చూడడం అన్యాయం. ఇది టీడీపీ, వైసీపీ చూసుకోవాల్సిన విషయం” అని కవిత ఉద్ఘాటించారు.





Total views : 202733