ఏపీలో బ్యాంకింగ్ సేవలను ప్రజల చెంతకు తీసుకెళ్లే దిశగా మరో కీలక అడుగు పడింది. పల్నాడు జిల్లా నరసరావుపేటలో నిర్వహించిన మెగా క్రెడిట్ అవుట్రీచ్ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. అర్హులైన రైతులు, విద్యార్థులు, మహిళలు, చిన్న వ్యాపారులకు భారీ స్థాయిలో రుణాలు అందజేశారు. ప్రజల వద్దకే బ్యాంకులు వెళ్లి సేవలు అందించడం అభినందనీయమని సీఎం పేర్కొనగా.. ప్రతి గ్రామానికి బ్యాంకింగ్ సేవలను విస్తరించడం ప్రధాని మోదీ లక్ష్యమని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.
ప్రజల వద్దకే బ్యాంకులు వెళ్లి రుణాలు అందించడం గర్వకారణమని అన్నారు సీఎం చంద్రబాబు. పల్నాడు జిల్లా నరసరావుపేటలోని కోడెల శివప్రసాదరావు స్టేడియంలో ఏర్పాటు చేసిన క్రెడిట్ అవుట్ రీచ్ కార్యక్రమంలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్తో కలిసి సీఎం పాల్గొన్నారు. రైతులు, విద్యార్థులు, అర్హులైన పేదలందరికీ రుణం అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చంద్రబాబు స్పష్టం చేశారు. సంక్షేమ కార్యక్రమాలతో పాటు ప్రజల జీవన ప్రమాణాలు పెరిగితేనే నిజమైన అభివృద్ధి అని సీఎం చంద్రబాబు చెప్పారు. ఒక్క రోజే 1.04లక్షల మందికి బ్యాంకు రుణాలు అందించడం ఒక చరిత్రగా అభివర్ణించారు. బ్యాంకింగ్ వ్యవస్థలో కేంద్ర ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ విప్లవాత్మక మార్పులు తెచ్చారని.. ప్రధాని మోదీ వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా ఎన్నో సంస్కరణలు అమలు చేస్తున్నారని సీఎం స్పష్టం చేశారు.
ప్రతి గ్రామానికి బ్యాంక్ సేవలు అందించడమే ప్రధాని మోదీ లక్ష్యమని అన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. 2014 నుంచి గ్రామాలకు బ్యాంక్ సేవలను అందించే దిశగా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు నిరర్థక ఆస్తులతో బ్యాంకుల పనితీరు బాగుండేది కాదన్నారు. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బ్యాంకింగ్ వ్యవస్థలో సమూల మార్పులు తెచ్చామన్నారు. ప్రధాని మోదీ సూచనలతో ప్రజల వద్దకే బ్యాంకులు వెళ్తున్నాయని.. దీని వల్ల ఈరోజు లక్షల మందికి సులువుగా లోన్లు అందుతున్నాయని చెప్పారు. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చాలా చేస్తామని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.