తెలుగు రాష్ట్రాల్లో వర్షం పడిందంటే చాలు రైతులు వ్యవసాయ పనుల కోసం సిద్ధమవుతారు. కానీ ఏపీలోని రాయలసీమలో మాత్రం మొదటి వర్షం కురిస్తే చాలు.. వజ్రాల వేట మొదలవుతుంది. గత రెండు రోజులుగా సీమ ప్రాంతంలో కురిసిన తొలకరి వర్షాలు స్థానిక ప్రజలకు సరికొత్త ఆశలను మోసుకొచ్చాయి. పత్తికొండ తాలూకా గిరి గట్ల నుండి జొన్నగిరి పరిసర ప్రాంతాలలో వజ్రాలు దొరకడం అనేది సహజంగా అందరికీ తెలిసిందే. గత రెండు రోజులుగా జిల్లావ్యాప్తంగా మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తుండటంతో, ఎగువ మట్టి కొట్టుకుపోయిన వజ్రాలు బయటపడే అవకాశం ఉండటంతో స్థానిక ప్రజలతో పాటు పొరుగు ప్రాంతాల వారు కూడా పొలాల బాట పట్టారు. చిన్న వజ్రం దొరికినా తమ తలరాత మారిపోతుందనే బలమైన నమ్మకంతో, వందలాది మంది ప్రజలు ఉదయాన్నే ఫుడ్ క్యారేజీలు సర్దుకుని వచ్చి జొన్నగిరి పరిసరాల్లోని వ్యవసాయ పొలాలను జల్లెడ పడుతున్నారు.
రాయలసీమ ప్రాంతంలో వర్షాకాలం ప్రారంభంలో వజ్రాల కోసం అన్వేషణ సాగించడం దశాబ్దాలుగా వస్తున్న ఒక ఆనవాయితీ. ముఖ్యంగా అనంతపురం జిల్లాలోని వజ్రకరూరు , కర్నూలు జిల్లాలోని జొన్నగిరి, పెరవలి తదితర ప్రాంతాలలో ఈ వజ్రాల వేట ఎక్కువగా కనిపిస్తుంది. ప్రతి ఏటా తొలి వర్షం పడగానే స్థానిక రైతులు, కూలీలతో పాటు సుదూర ప్రాంతాల నుంచి వచ్చే ‘లక్’ అన్వేషకులు ఇక్కడి ఎర్రనేలల్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. ఇక్కడ లభ్యమయ్యే విలువైన రత్నాలను కొనుగోలు చేసేందుకు గుంటూరు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వజ్రాల వ్యాపారులు, స్థానిక ఏజెంట్లు ఇక్కడే మకాం వేసి రికార్డు ధరకు వాటిని సొంతం చేసుకుంటుంటారు.



Total views : 90074