ఏపీలోని 45 లక్షల మందిని ఏఐ, క్వాంటం, వైజర్ డేటా సెక్యూరిటీలో నిపుణులుగా మారుస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. సాంకేతికతను అనుసరించడమే కాకుండా దానిని ఆవిష్కరించే స్థాయికి ఏపీ ఎదిగేలా ప్రోత్సహిస్తున్నామని వెల్లడించారు. ప్రతి పౌరుడికి ఏఐ లాంటి సాంకేతికతను అందుబాటులోకి తీసుకు రావాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. అమరావతిలోని ఎస్ఆర్ఎం వర్సిటీ, గన్నవరం మేధాటవర్స్లో ఏర్పాటు చేసిన క్వాంటం టెస్ట్బెడ్స్ను ఎస్ఆర్ఎం వర్సిటీ నుంచి ఆయన ప్రారంభించారు. 1ఎస్, 1క్యూ క్వాంటం టెస్ట్బెడ్స్ను సీఎం జాతికి అంకితం చేశారు.
డిసెంబరు నుంచి అమరావతిలో క్వాంటం వ్యాలీ కూడా ప్రారంభమవుతుందన్నారు సీఎం చంద్రబాబు. వన్ ఫ్యామిలీ వన్ ఆంత్రప్రెన్యూర్తో పాటు ప్రతీ వెయ్యి మందికి ఒక స్టార్టప్ను తీసుకురావాలని ఆలోచన చేస్తున్నట్లు వెల్లడించారు. ఆర్టీఐహెచ్ ద్వారా స్టార్టప్ ఎకోసిస్టమ్ను ప్రోత్సహిస్తున్నామని చంద్రబాబు వివరించారు. ఐఐటీ చెన్నై, ఐబీఎం సంస్థల భాగస్వామ్యంతో లక్షలాది మందిని క్వాంటం రంగంలో నిపుణులుగా తీర్చిదిద్దుతున్నామని స్పష్టం చేశారు. కొత్త సంస్థలు, నైపుణ్యం, క్వాంటం మౌలిక సదుపాయాలతో భవిష్యత్తును నిర్మిస్తున్నామని చంద్రబాబు వివరించారు