అమెరికా వైమానిక విన్యాసాల్లో ప్రమాదం జరిగింది. US నేవీకి చెందిన రెండు మిలటరీ ఫైటర్ జెట్స్ ఢీ కొన్నాయి. ఇదాహోలోని ఎయిర్ఫోర్స్ బేస్ ఎయిర్ షోలో జరిగింది ఈ ఘటన. గగనతలంలో విన్యాసాలు చేస్తుండగా అమెరికా నౌకాదళానికి చెందిన రెండు యుద్ధ విమానాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. అయితే, అదృష్టవశాత్తూ విమానాల్లోని నలుగురు సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే రెండు విమానాల్లోని నలుగురు సిబ్బంది పారాచూట్ల సాయంతో కిందకు దూకేశారు. వారి పరిస్థితి నిలకడగా ఉందని, ఎయిర్బేస్లో ఉన్న ఇతరులకు ఎలాంటి గాయాలు కాలేదని వెల్లడించారు అధికారులు.
ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రెండు విమానాలు ఒకదానికొకటి దగ్గరగా వచ్చి ఢీకొనడం, వెంటనే నలుగురు సిబ్బంది పారాచూట్లతో బయటకు దూకడం, ఆ తర్వాత విమానాలు కిందపడి భారీ మంటల్లో కాలిపోవడం ఈ వీడియోల్లో కనిపించాయి. ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు ఎయిర్ షోను రద్దు చేసి, బేస్ను లాక్డౌన్ చేశారు.
గాల్లో విమానాలు ఢీకొన్నప్పుడు సిబ్బంది బయటపడటం చాలా అరుదని, ఇది నిజంగా అద్భుతమంటున్నారు విమానయాన భద్రతా నిపుణులు. రెండు విమానాలు ఢీకొన్న తర్వాత ఒకదానికొకటి అతుక్కుపోయి కిందకు పడటం వల్లే, సిబ్బందికి బయటకు దూకే సమయం లభించి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. ఇది పైలట్ తప్పిదం వల్లే జరిగి ఉండే అవకాశముందని తెలిపారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు అధికారులు.





Total views : 80185