ఈ నెల 25న ఏసీబీ కోర్టు జడ్జికి రాసిన మూడు పేజీల లేఖలో చంద్రబాబు పలు అంశాలు ప్రస్తావించారు. రాజమండ్రి జైల్లో ఈ మధ్య కాలంలో చోటు చేసుకున్న పలు లోపాలు. జడ్ ప్లస్ కేటగిరీ భద్రతలో ఉన్న తన ప్రాణాలకు ముప్పుగా పరిణమించినట్లు చంద్రబాబు తెలిపారు. సెప్టంబర్ 10న తనను అరెస్టు చేసి 11న రాజమండ్రి జైలుకు రిమాండ్ కు పంపారని, జైల్లోకి తాను ప్రవేశిస్తున్న సమయంలో తనను ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో ప్రచారం చేశారని ఆరోపించారు. తద్వారా తన ప్రతిష్టను మంటగలిపారని, అలాగే తన భద్రతకు ముప్పు కలిగించారని చంద్రబాబు తెలిపారు. అలాగే తనను హతమార్చేందుకు ఓ వామపక్ష తీవ్రవాద సంస్ధ కుట్ర పన్నిందని, ఇందుకోసం భారీగా డబ్బు కూడా చేతులు మారినట్లు, ఈ మేరకు జైలు సూపరింటెండెంట్ కు ఓ లేఖ కూడా అందినట్లు తనకు తెలిసిందని చంద్రబాబు వెల్లడించారు. దీనిపై పోలీసులు అధికారులు ఇప్పటివరకూ స్పందించలేదని, ఆ లేఖపై ఎలాంటి విచారణ కూడా జరపలేదన్నారు. అలాగే ఎన్డీపీఎస్ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఓ వ్యక్తి పెన్ కెమెరాతో జైల్లో సంచరిస్తూ తోటి ఖైదీల ఫొటోలు తీస్తున్నాడనని తనకు తెలిసిందన్నారు. అలాగే రాజమండ్రి జైలుపై ఓ డ్రోన్ కెమెరా సంచరిస్తూ తమ ఫొటోలు, వీడియోలు తీస్తోందని, అయినా జైలు అధికారులు కానీ, పోలీసులు కానీ దాన్ని అడ్డుకునేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. జైల్లో గంజాయి ప్యాకెట్లు వస్తున్నాయని, అక్కడ మొత్తం 2200 మంది ఖైదీలుంటే అందులో 750 మంది తీవ్ర ఆరోపణలు ఉన్నవారు ఉన్నారని, ఇవన్నీ తన భద్రతకు ముప్పుగా మారాయన్నారు. ఈ నెల ఆరో తేదీన తనను కలిసి వెళ్తున్న కుటుంబ సభ్యుల్ని మరో డ్రోన్ కెమెరా షూట్ చేసిందని, దీన్ని బట్టి చూస్తుంటే తనతో పాటు కుటుంబానికి కూడా ముప్పు ఉందన్నారు. రాష్ట్రంలో గత నాలుగున్నరేళ్లలో రాష్ట్రంలో పలు చోట్ల తిరిగిన తనపై అధికార పార్టీ ప్రోద్భలంలో దాడులు జరిగాయన్నారు. జగన్ అధికారంలోకి రాగానే తన భద్రతను తగ్గించారని, హైకోర్టు జోక్యంతో తిరిగి పునరుద్ధరించారన్నారు. 2019 ఆగస్టులో అమరావతిలో బస్సు యాత్ర చేపడితే వైసీపీ కార్యకర్తలు రాళ్ల దాడులకు పాల్పడ్డారన్నారు. అలాగే ఈ ఏడాది ప్రాజెక్టుల వద్దకు తాను వెళ్లినప్పుడు కూడా వైసీపీ కార్యకర్తలు దాడులు చేశారన్నారు. ఈ పరిణామాల్ని అన్నింటిని దృష్టిలో ఉంచుకుని రాజమండ్రి జైల్లో తనకు పూర్తిస్దాయిలో భద్రత కల్పించాలని చంద్రబాబు జడ్జిని కోరారు.
Latest News
మరో నెల రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాజస్థాన్ లో ఈడీ సోదాలు కలకలం రేపుతున్నాయి. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు గోవింద్ సింగ్ డోటాస్రా, మహువా నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి నివాసాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు గురువారం తనిఖీలు చేపట్టారు. మరోవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ కుమారుడు వైభవ్ కు ఈడీ సమన్లు జారీ చేసింది. ఫెమా నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించిన కేసులో వైభవ్కు ఈ సమన్లు అందినట్లు తెలిసింది. ఈ కేసులో వైభవ్ను ప్రశ్నించేందుకు అక్టోబరు 27న దర్యాప్తు సంస్థ ఎదుట హాజరుకావాలని ఈడీ పేర్కొన్నట్లు అధికారులు వెల్లడించారు.దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ కేంద్రంపై ధ్వజమెత్తారు. అక్టోబరు 25న, రాజస్థాన్ మహిళల కోసం కాంగ్రెస్ హామీలు ప్రకటించింది. ఆ మరుసటి రోజు అక్టోబరు 26న రాజస్థాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోవింద్ సింగ్పై ఈడీ దాడులకు దిగింది. నా కుమారుడు వైభవ్కు సమన్లు జారీ చేసిందని గహ్లోత్ వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు.
గాజాపై మరోసారి ఇజ్రాయెల్ గ్రౌండ్ ఎటాక్ చేసింది. గత ఆదివారం రాత్రి ఓసారి భూతల దాడి చేసిన ఇజ్రాయెల్ ఆర్మీ .. మళ్లీ బుధవారం అర్థరాత్రి కూడా ఉత్తర గాజా బార్డర్ ఏరియాలపై స్వల్ప స్థాయిలో ఎటాక్స్ నిర్వహించింది. ఇందులో భాగంగా హమాస్కు సంబంధించి మొత్తం 250 స్థావరాలపై దాడులు చేశామని ఇజ్రాయెల్ ఆర్మీ వెల్లడించింది. ఈసందర్భంగా హమాస్ కమాండ్ సెంటర్లు, సొరంగాలు, రాకెట్ లాంచర్లు, యాంటీ ట్యాంక్ క్షిపణి ప్రయోగ స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపింది. ఉత్తర గాజాలోని నివాసాల మధ్యే రాకెట్ లాంచర్లు ఉన్నాయని గుర్తించామని ఆరోపించింది. గాజాలో ఇంధన వనరులు పూర్తిగా అయిపోయాయని ఐక్యరాజ్యసమితి వెల్లడించిన వెంటనే ఇజ్రాయెల్ ఆర్మీ గ్రౌండ్ ఎటాక్ చేయడం గమనార్హం. అయితే ఈ దాడుల్లో ఇరువైపులా ఎంతమేర ప్రాణ నష్టం జరిగిందనే వివరాలు తెలియరాలేదు. మరోవైపు దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్ పట్టణంలో 75 మంది ఉంటున్న ఓ నివాస భవనంపై ఇజ్రాయెల్ గగనతల దాడి చేసింది. ప్రాణనష్టం గురించి తెలియరాలేదు. ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటివరకు మరణించిన గాజా పౌరుల సంఖ్య 6500 దాటింది.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో మావోయిస్టు లేఖలు కలకలం రేపాయి. వాజేడు, వెంకటాపురం ఏరియా కమిటీ మావోయిస్టు కార్యదర్శి సుధాకర్ పేరుతో లేఖ విడుదల చేశారు. భూటకపు అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరించాలని. ఓట్ల కోసం వచ్చే బీజేపీ, బీఆర్ ఎస్ పార్టీలను తరిమి కొట్టాలని లేఖలో పేర్కొన్నారు. హరితహారం పేరుతో పోడు బూముల్లో మొక్కలు నాటి రైతుల భూములను లాక్కుంటున్నారని రాశారు. బీజేపీ ప్రభుత్వం మోడీ నాయకత్వంలో బ్రాహ్మనీయ, హిందుత్వ మతోన్మాదం పేరుతో.. దళితులపై, మైనారిటీలపై దాడులు చేస్తున్నారని మావోయిస్టులు లేఖలో వివరించారు.
తెలంగాణాలో మరో కొత్త పార్టీ పురుడు పోసుకుంది. తెలంగాణలో మార్పు కోసం భారత చైతన్య యువజన పార్టీ పేరుతో తెలంగాణలో చిన్నా భిన్నమైన ప్రజల జీవితాలలో వెలుగును నింపడానికి తెలంగాణలో భారత చైతన్య యువజన పార్టీ వచ్చిందని ఆ పార్టీ అధ్యక్షుడు బోడ రామచంద్ర యాదవ్ చెప్పారు. రాబోవు ఎన్నికలలో బరిలోకి దిగుతామని ,తెలంగాణ ప్రజలు స్పష్టంగా రాజకీయ మార్పును కోరుకుంటున్నారని అన్నారు. గడిచిన 10 సంవత్సరాల కాలంలో అధికారంలో ఉన్న బి.ఆర్.ఎస్ పార్టీ అడుగు అడుగున అవినీతికి పాల్పడుతూ ప్రజల జీవితంతో చెలగాటం ఆడుతొందని ఆరోపించారు. తెలంగాణ ప్రజలు ఆశీర్వదిస్తే రాబోవు కాలంలో తెలంగాణలో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి లక్ష్యంగా తాము పనిచేస్తామని భారత చైతన్య యువజన పార్టీ జాతీయ అధ్యక్షులు బోడ రామచంద్ర యాదవ్ తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం తమ పార్టీకి చెరుకు రైతును గుర్తుగా కేటాయించారని, రానున్న నాలుగైదు రోజుల్లో తమ పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించనున్నట్లు తెలిపారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల్లో వైసీపీపై అసంతృప్తి పెరగడం వల్లే.. ఆ పార్టీ నేతలు బస్సు యాత్ర చేయాలనుకుంటున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో ముఖ్య నేతలు సమావేశమై తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. పేదల గొంతు కోస్తున్న పెత్తందారు జగన్ రెడ్డి కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడారు. వైసీపీ సామాజిక సాధికారత బస్సు యాత్రపై మండిపడ్డారు. రేపల్లెలో పదో తరగతి చదివే బీసీ విద్యార్థి దహనం చేసిన ఘటనపై ఒత్తిడి తేవాలని స్పష్టం చేశారు. నంద్యాలలో మైనార్టీ వ్యక్తి సలాం కుటుంబం ఆత్మహత్య ఘటనను వైసీపీకి గుర్తు చేయాలన్నారు. రద్దు చేసిన పథకాలపై సమాధానం చెప్పిన తర్వాతే వైకాపా బస్సు యాత్ర చేయాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.
స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అత్యవసర పిటిషన్ దాఖలుకు హైకోర్టు నిరాకరించింది. వ్యాజ్యం దాఖలుకు అనుమతినిచ్చి అత్యవసరంగా విచారణ జరపాలని చంద్రబాబు తరఫు న్యాయవాదులు చేసిన విజ్ఞప్తిని హైకోర్టు తోసిపుచ్చింది. తనకు వైద్య పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వ వైద్యులు సైతం నివేదికలు ఇచ్చారని చంద్రబాబు పిటిషన్లో పేర్కొన్నారు. ఈ ఏడాది జూన్లో ఎడమ కంటి శుక్లం శస్త్రచికిత్స చేయించుకున్నానని తెలిపారు. సెప్టెంబరులోపు కుడి కంటికి సైతం చికిత్స చేయించుకోవాలని వైద్యులు సూచించారన్నారు. ప్రస్తుతం కుడి కంటి చూపు మందగించిన కారణంగా అత్యవసరంగా శస్త్ర చికిత్స అవసరమని వివరించారు. జాప్యం చేస్తే చూపు పూర్తిగా మందగించే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. దీనిపై కంటి వైద్య నిపుణులు ఈనెల 21న ఇచ్చిన నివేదికను కోర్టు ముందు ఉంచారు. మధ్యంతర బెయిలు కోసం దాఖలు చేసిన అనుబంధ పిటిషన్పై దసరా సెలవుల ప్రత్యేక బెంచ్ విచారణ జరపనుంది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప బెంచ్ ముందు ఈ పిటిషన్ విచారణ జాబితాలోకి వచ్చింది. చంద్రబాబును అరెస్టు చేసే సమయంలో సీఐడీ అధికారులు ఎవరితో మాట్లాడారు, వారి ఫోన్ కాల్ డేటా రికార్డులను భద్రపరిచేలా ఆదేశించాలంటూ ఆయన తరఫు న్యాయవాదులు ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై విచారణ శుక్రవారానికి వాయిదా పడింది. ఏసీబీ కోర్టు న్యాయాధికారి హిమబిందు ఈ మేరకు ఉత్తర్వులు జారీచేశారు. ఈ పిటిషన్పై సీఐడీ కౌంటర్ దాఖలుచేసింది. కాల్ డేటా బయటకు వెల్లడించడం వల్ల దర్యాప్తు అధికారుల భద్రతకు నష్టం కలుగుతుందన్నారు. గోప్యతకు భంగం కలుగుతుందని పేర్కొంది. చంద్రబాబును అరెస్టు చేసి సీఐడీ కార్యాలయానికి తరలిస్తున్న సమయంలో తమ అనుమతి లేకుండా మీడియా. వీడియో, ఫోటోలు తీసుకుందన్నారు.
డీకే అరుణ బీజేపీకి గుడ్ బై చెపుతున్నారంటూ వస్తున్న వార్తలపై డీకే అరుణ స్పందించారు. తాను బీజేపీని వీడే ప్రసక్తే లేదని, కాంగ్రెస్ లో చేరే అవకాశమే లేదని చెప్పారు. తనపై కొందరు పనికట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ అధినాయకత్వం తనను గుర్తించి జాతీయ ఉపాధ్యక్ష పదవిని ఇచ్చిందని అన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో పని చేయాలంటే అదృష్టం ఉండాలని చెప్పారు. మరోవైపు, బీజేపీ సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా బీజేపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టు ఆయన స్పష్టం చేశారు. నియంత కేసీఆర్ పాలనను అంతమొందించేందుకే తాను కాంగ్రెస్ లో చేరుతున్నానని ఆయన తెలిపారు.
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పెంటపాడులో నకిలీ వైద్యుడి లీలలు కొనసాగుతున్నాయి. ఓ చోట ప్రభుత్వ ఫార్మసిస్టుగా పని చేస్తూనే.. మరోచోట నకిలీ వైద్యుడి అవతారం ఎత్తాడు. తెలిసీ, తెలియని వైద్యం చేస్తూ అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాడు. పాడుబడ్డ బిల్డింగ్ ను అద్దెకు తీసుకుని అనదికారిక ఆసుపత్రి నిర్వహణ చేపడుతున్నాడు. ఇదేంటని ప్రశ్నిస్తే పొంతనలేని సమాధానాలిస్తున్నాడంటూ ప్రజలు ఫిర్యాదు చేస్తున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నకిలీ వైద్యుడిని ఫార్మసిస్ట్ ఉధ్యోగం నుంచి తొలగించి, అనుమతులు లేని ఆసుపత్రి, ల్యాబ్, బెడ్స్, మందుల షాపు, సీజ్ చేసి, ఇతనిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం రేగింది. మైన్ రాష్ట్రంలోని లెవిస్టన్ నగరంలో బుధవారం రాత్రి ఓ ఆగంతుకుడు కాల్పులకు తెగబడటంతో 22 మంది దుర్మరణం చెందారు. సెమీ ఆటోమేటిక్ తుపాకీతో నిందితుడు ఓ బౌలింగ్ యాలీ, మరో రెస్టారెంట్లో విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డాడు. స్థానిక మీడియా కథనాల ప్రకారం ఈ ఘటనలో మరో 60 మంది గాయాల పాలయ్యారు. ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నిందితుడి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. అతడి ఫొటోను కూడా ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. ఆ ప్రాంతంలోని వ్యాపారాలను మూసేయాలని పోలీసులు స్థానికులకు సూచించారు. కాగా, ఈ దారుణంపై మెయిన్ చట్టసభ సభ్యుడు జేరెడ్ గోల్డెన్ ‘ఎక్స్’ వేదికగా విచారం వ్యక్తం చేశారు. తాను భయభ్రాంతులకు లోనైనట్టు చెప్పుకొచ్చారు.






Total views : 194583