ప్రముఖ విద్యావేత్త, సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ కీలక వ్యాఖ్యలు చేశారు. నీట్ వ్యవహారం, విద్యా వ్యవస్థలో తీసుకురావాల్సిన సంస్కరణల కోసం 26 రోజుల సుదీర్ఘంగా నిరాహార దీక్ష చేసినా.. తనపై వస్తున్న విమర్శలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఒక వీడియో ప్రకటనను విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వంతో రహస్య ఒప్పందం కుదుర్చుకుని తన దీక్షను విరమించారంటూ సాగుతున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండించిన వాంగ్చుక్.. ఇటువంటి నిరాధారమైన వ్యాఖ్యలు తనను తీవ్రంగా బాధించాయన్నారు. ఈ సందర్భంగా సోనమ్ వాంగ్చుక్ మాట్లాడుతూ, దేశంలోని లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, విద్యా వ్యవస్థలో పారదర్శకత కోసం తాను చేపట్టిన ఈ స్ట్రైక్ అత్యంత పవిత్రమైనదని అభివర్ణించారు. “నాకు కేంద్రంతో డీల్ చేసుకోవాల్సిన అవసరమే ఉంటే, ఈ తీవ్రమైన ఎండలో, వాతావరణ పరిస్థితులను తట్టుకుంటూ ఏకంగా 26 రోజుల పాటు ఆకలితో నిరాహార దీక్ష ఎందుకు చేస్తానని ప్రశ్నించారు.
విద్యార్థుల హక్కుల కోసం, న్యాయమైన విద్యా విధానం కోసం తాను చేసిన పోరాటంలో ఎలాంటి స్వార్థం లేదని స్పష్టం చేశారు. విద్యార్థుల శ్రేయస్సు కోసం ఇన్ని రోజులు ప్రాణాలను సైతం పణంగా పెట్టి పోరాటం చేసిన తర్వాత కూడా తన నిజాయితీని, నిబద్ధతను నిరూపించుకోవాల్సిన పరిస్థితి రావడం పట్ల ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం పారదర్శకంగా పోరాడుతున్న వారిపై ఇటువంటి నీచమైన ఆరోపణలు చేయడం అత్యంత బాధాకరమన్నారు. తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని, విద్యా వ్యవస్థలో మార్పు కోసం సాగుతున్న ఈ పోరాటానికి అందరూ మద్దతుగా నిలవాలని ఆయన ఈ వీడియో ద్వారా కోరారు.