కోయంబత్తూరులోని తొండముత్తూరు ప్రాంతంలో ప్రేమ వ్యవహారం వివాదాస్పదంగా మారి దారుణ ఘటన చోటుచేసుకుంది. బ్రేకప్ చెప్పిందన్న కోపంతో ఓ యువతి ఇంటిపై ఆమె మాజీ ప్రియుడు పెట్రోల్ బాంబులతో దాడి చేయడం కలకలం రేపింది. ఈ ఘటనలో ఇంట్లో చదువుకుంటున్న యువతి తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి.
తొండముత్తూరు సమీపంలోని కలిక్కనాయకన్పాళయం ప్రాంతంలో బాధిత కుటుంబం నివాసం ఉంటోంది. సీసీటీవీ ఫుటేజీలో ఇంటి ముందు ప్రశాంత వాతావరణం కనిపించగా, కొద్దిసేపటికే ఇద్దరు వ్యక్తులు బైక్పై అక్కడికి చేరుకున్నారు. అనంతరం పెట్రోల్తో నింపిన బీర్, మద్యం సీసాలను ఇంటిపైకి విసిరారు. దీంతో ఒక్కసారిగా భారీ మంటలు చెలరేగి ఇంటి ప్రవేశద్వారం, బయట పార్క్ చేసిన ఎర్రటి స్కూటర్ మంటల్లో చిక్కుకున్నాయి. మంటల కారణంగా దట్టమైన పొగ వ్యాపించగా, సీసీటీవీ కెమెరా కూడా స్వల్పంగా కదిలినట్లు దృశ్యాల్లో కనిపించింది. అదృష్టవశాత్తూ మంటలు ఇంటి బయటకే పరిమితం కావడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
ఈ ఘటనలో ప్రధాన నిందితుడిని కార్తీక్ అలియాస్ మరియప్పన్గా గుర్తించారు. బాధితురాలి తండ్రి, తాలియూర్ టౌన్ పంచాయతీ ఉద్యోగి సుందరమూర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోయంబత్తూరులోని ఓ కళాశాలలో చదువుతున్న సమయంలో యువతికి కార్తీక్తో పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారింది. అయితే అతడిపై హత్య, దోపిడీ సహా తమిళనాడులోని పలు పోలీస్ స్టేషన్లలో 31కు పైగా క్రిమినల్ కేసులు ఉన్నట్లు యువతికి తెలిసింది. దీంతో ఆమె అతనికి బ్రేకప్ చెప్పింది. అప్పటి నుంచి తిరిగి సంబంధం కొనసాగించాలని ఒత్తిడి చేస్తూ వేధింపులకు పాల్పడుతున్నాడని సమాచారం. ఆదివారం సాయంత్రం కార్తీక్ తన అనుచరులతో కలిసి రెండు బైక్లపై యువతి ఇంటికి వచ్చి, ముందుగా యువతి తండ్రిని బెదిరించిన అనంతరం పెట్రోల్ బాంబులతో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చేపట్టారు.





Total views : 91059