ఏపీలో యోగాంధ్ర-2026ను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. జూన్ 7 నుంచి 14 రోజులు రాష్ట్రవ్యాప్త కార్యక్రమాలు ప్రణాళిక ప్రకారం చేపట్టాలని సూచించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవ నిర్వహణపై ఉండవల్లి నివాసంలో మంత్రులు, అధికారులతో సమీక్షించారు.యోగాంధ్ర కార్యక్రమాల వివరాలను ప్రజెంటేషన్ ద్వారా ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. రాష్ట్రప్రభుత్వ యోగా, నేచురోపతి విభాగం సలహాదారు మంతెన సత్యనారాయణరాజు యోగాంధ్రపై రూపొందించిన పోస్టర్ ను సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. 90 ఆసనాల వీడియోలు, 21 ఆరోగ్య సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ఆసనాల వీడియోలు, రోజువారీ సాధన కోసం యోగాసనాలు, ప్రాణాయామంపై ఏడు వీడియోలు, యోగా సందేహాలు ప్రశ్నలు-సమాధానాలపై చేసిన వీడియోలను పబ్లిక్ డొమైన్లో పెట్టనున్నట్లు మంతెన సత్యనారాయణ రాజు తెలిపారు. 8142404888 నంబర్కు హాయ్ అని మెసేజ్ పంపినా, ఈ వీడియోలు వస్తాయన్నారు. సమీక్షలో మంత్రులు నారాయణ, సత్యకుమార్ యాదవ్, ఆనం రామనారాయణ రెడ్డి, కందుల దుర్గేష్, సీఎస్ సాయిప్రసాద్, ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్, కమిషనర్ వీర పాండియన్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని అమరావతి సమీప కృష్ణానదిపై నిర్మించిన బ్రిడ్జిపై 25వేల మందితో నిర్వహించడానికి ప్రణాళిక రూపొందించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు పాల్గొంటారని అధికారులు తెలిపారు. జిల్లా కేంద్రాల్లో వెయ్యిమందితో చేపట్టే కార్యక్రమాల్లో మంత్రులు, జిల్లా ఉన్నతాధికారులు పాల్గొంటారన్నారు. రాష్ట్రంలో అందుబాటులో ఉన్న 1.50 లక్షల మంది ట్రైనర్లకు అదనంగా మరో లక్షమందికి ట్రైనర్లుగా శిక్షణ ఇస్తారు. ఒక జిల్లాకు ఒక థీమ్తో 14 రోజులు యోగాంధ్ర నిర్వహిస్తారని తెలిపారు. ఇందుకు జిల్లాకు రూ.25లక్షల చొప్పున కేటాయించారు.
ప్రతి జిల్లాలోని రెండు ప్రముఖ పర్యాటక ప్రాంతాల చొప్పున.. 56 చోట్ల ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయి.14 రోజుల పాటు పార్కులు, విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, స్వర్ణ వార్డు- స్వర్ణ గ్రామ కార్యాలయాల్లో యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహిస్తారు. గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా నుంచి రాష్ట్రస్థాయి వరకు అవార్డులు అందిస్తారని అధికార వర్గాలు తెలిపాయి.





Total views : 90260