ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు. విజయనగరం జిల్లాలోని భోగాపురంలో నూతనంగా నిర్మించిన విమానాశ్రయ ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీని ఆహ్వానించనున్నారు. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆగస్టు 1వ తేదీన ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ముఖ్య అతిథిగా ఆహ్వానించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ఢిల్లీ వెళుతున్నారు. ఈ మేరకు ప్రధానితో భేటీ అయి, ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా కోరనున్నారు. ప్రధాని మోదీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కూడా సీఎం చంద్రబాబు కలవనున్నారు. వీరితో పాటు కేంద్ర మంత్రులు పియూష్ గోయల్, మనోహర్ లాల్ ఖట్టర్, సీఆర్ పాటిల్తో కూడా ముఖ్యమంత్రి భేటీ అయ్యే అవకాశం ఉంది. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ఈ భేటీల్లో చర్చించే వీలుందని భావిస్తున్నారు. సీఎం పర్యటన షెడ్యూల్ ప్రకారం… ఉదయం 7.30 కి అమరావతి నుంచి బయలుదేరి ఉదయం 10 గంటలకు ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకుంటారు. రోజంతా అధికారిక సమావేశాల్లో పాల్గొని, రాత్రికి ఢిల్లీలోనే బస చేస్తారు. పర్యటన ముగించుకుని రేపు ఏపీకి చేరుకుంటారు.
Tag:





Total views : 223674