ఏపీ లిక్కర్ రవాణా కేసు దర్యాప్తు మరింత వేగవంతమైంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం రవాణా కేసులో ముగ్గురు కీలక నిందితులను మూడు రోజుల పాటు కస్టడీకి తీసుకునేందుకు ఈడీకి అనుమతినిచ్చింది హైదరాబాద్లోని నాంపల్లి కోర్టు. వీరి విచారణ ఇవాల్టి నుంచి ప్రారంభం కానుంది. నిందితుల్లో ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ వాసుదేవ రెడ్డి, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు కారుమూరి సునీల్, రాజ్ కేసిరెడ్డి ఉన్నారు. ఈ ముగ్గురినీ గత జూన్ నెలలో అరెస్ట్ చేయగా, అప్పటి నుంచి వారు జ్యుడీషియల్ రిమాండ్లో ఉన్నారు. తాజాగా ఈడీ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేపట్టిన కోర్టు, నిందితులను మూడు రోజుల పాటు ఈడీ కస్టడీకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
గత ప్రభుత్వ హయాంలో APSBCL మద్యం రవాణా టెండర్లలో భారీగా అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. టెండర్ల నిబంధనలను నిబంధనలకు విరుద్ధంగా మార్చడం వల్ల ప్రభుత్వ ఖజానాకు దాదాపు రూ.195 కోట్ల నష్టం వాటిల్లిందని ఈడీ ప్రాథమికంగా అంచనా వేసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం PMLA కింద ఈడీ ఈ కేసులో దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో ఈ కేసు నిందితులను ఈడీ కస్టడీకి అప్పగించేందుకు నాంపల్లి కోర్టు అనుమతించింది. దీంతో నేటి నుంచి వరుసగా మూడు రోజుల పాటు నిందితులను విచారించనున్నారు. నిందితులు వాసుదేవరెడ్డి, రాజ్కేసిరెడ్డి, కారుమూరి సునీల్ను ఈడీ అధికారులు కస్టడీకి తీసుకోనున్నారు. మద్యం అక్రమ రవాణా, నిధుల మళ్లింపు వ్యవహారంలో ఇతర భాగస్వాములకు ఉన్న సంబంధాలపై విచారించనున్నారు. వీరిని ప్రశ్నించడం ద్వారా ఈ కుంభకోణం వెనుక ఉన్న అసలు సూత్రధారులు, ఇతర కీలక లావాదేవీలకు సంబంధించి మరిన్ని ఆధారాలను బయటకు తీయవచ్చని ఈడీ అధికారులు భావిస్తున్నారు.




Total views : 212152