గుంటూరు జిల్లా పశ్చిమ నియోజకవర్గ, బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి, కన్వీనర్ వల్లూరు జయప్రకాష్ నారాయణ మలివిడత బిజెపి విజయ సంకల్ప యాత్ర రెండవ రోజు ఆంజనేయస్వామి దేవస్థానం వద్ద ప్రారంభమైంది. మారుతి నగర్, నాయి బ్రాహ్మణ కాలనీ, భాగ్యనగర్ కాలనీ, ఎల్ఐసి కాలనీ మీదుగా స్తంభాల గరువు రామాలయం వద్ద ముగిసినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధికార ప్రతినిధి సాధినేని యామిని శర్మ, జిల్లా అధ్యక్షులు వనమా నరేంద్రకుమార్ విచ్చేశారు. ఈ సందర్భంగా వల్లూరు జయప్రకాష్ నారాయణ మాట్లాడుతూ… ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో నిధులు ఇస్తుంటే సంక్షేమ పథకాల పేర్లు చెప్పి ఆ నిధులు అన్ని దారి మళ్ళిస్తున్నారు. నరేంద్ర మోడీ గారు దేశంలో ఎక్కడికి వెళ్లినా కానీ ప్రజల మధ్య తిరుగుతున్నారని, కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరదాల మాటున తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. ఇక బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి యామిని శర్మ మాట్లాడుతూ…
మోదీ ప్రధాని అయిన పదేళ్లలోనే అందరికీ సంక్షేమ పధకాలు అందేలా చేస్తున్నారు. మహిళలు, యువతకు సంక్షేమ ఫలాలు అందిస్తూనే, మరో పక్క అభివృధ్ది పై దృష్టి సారిస్తున్నారు. మన రాష్ట్రంలో ఓక్క రైల్వేలకే 89 వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. అలాగే లక్షా 10 వేల కోట్లతో జాతీయ రహదారులు మన రాష్ట్రంలో అభివృధ్ది చేశాము. మన గుంటూరులో 500 కోట్లు ఒక్క అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కి కేటాయించాము. మన రాష్ర్టంలో ఎన్ని పధకాలు అమలు చేస్తున్నా, ఏమీ చేయలేదనే వారికి విక్సిత్ భారత్ సంకల్ప యాత్ర ఒక చెంపపెట్టు లాంటిది. కేంద్ర ప్రభుత్వ పధకాలకు తమ తాతలు, తండ్రుల పేర్లు పెట్టుకుని బతుకుతున్న వైసిపి ప్రజలను వంచిస్తోంది. ప్రజలకు అందుతున్న పధకాలలో వందశాతం కేంద్రం నుండి వస్తున్నవే. ఇవన్నీ తెలుసుకున్న ప్రజలు బిజెపి కి మద్దతు ఇస్తున్నారు. ఒక్కసారి బిజెపి కి అధికారం ఇవ్వండి. అభివృధ్ది అంటే ఏంటో చూపిస్తాం అని అన్నారు.
CVr health
మేడిగడ్డ బ్యారేజీ వైఫల్యాలపై అధ్యయనం చేసి పునరుద్ధరణ పనులు సిఫార్సు చేసేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని నీటిపారుదల శాఖ నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర జలసంఘం మాజీ ఛైర్మన్ ఏబీ పాండ్యా నేతృత్వంలో ఎనిమిది మందితో కమిటీ ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపింది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీలో ఏడో బ్లాక్ అక్టోబరులో కుంగింది. ఈ బ్లాకులో పియర్స్ దెబ్బతినడంతోపాటు దిగువన కాంక్రీటు బ్లాకులు కొట్టుకుపోవడం, గ్లేసియర్ దెబ్బతినడం తదితర సమస్యలు ఎదురయ్యాయి. నేషనల్ డ్యాం సేఫ్టీ అధికారులు పరిశీలించి పలు చర్యలు సిఫార్సు చేశారు. ఏబీ పాండ్యా ఛైర్మన్గా ఉన్నరాష్ట్ర డ్యాం సేఫ్టీ అథారిటీ కూడా బ్యారేజీని పరిశీలించింది. మరోవైపు విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ విభాగం దర్యాప్తును ముమ్మరం చేసింది. అయితే, బ్యారేజీ కుంగడానికి గల కారణాలను తెలుసుకొని పునరుద్ధరించడం ప్రాధాన్య అంశంగా ఉన్న నేపథ్యంలో నిపుణుల కమిటీ ఏర్పాటుకు నీటిపారుదల శాఖ ప్రతిపాదించింది. ఏబీ పాండ్యా నేతృత్వంలో స్ట్రక్చరల్, హైడ్రాలజీ నిపుణుడు, మాజీ ఇంజినీర్ ఇన్ చీఫ్ రామరాజు, ఇంజినీర్ ఇన్ చీఫ్(జనరల్) మురళీధర్, ఇంజినీర్ ఇన్ చీఫ్(ఓఅండ్ఎం) నాగేందర్రావు తదితరులతో కమిటీ ఏర్పాటుకు ప్రభుత్వ ఆమోదాన్ని కోరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ ఆమోదం తర్వాత కమిటీ.. బ్యారేజీ కుంగడానికి గల కారణాలపై అధ్యయనం చేసి రెండు, మూడు ప్రత్యామ్నాయాలతో నివేదిక తయారు చేయనుంది. తర్వాత కేంద్ర జలసంఘంతో చర్చించి తుది ఆమోదంతో పునరుద్ధరణ పనులు చేపట్టాల్సి ఉందని ఆయా వర్గాలు తెలిపాయి.
యాదాద్రి పుణ్యక్షేత్రానికి పునర్వైభవం వచ్చేలా చర్యలు చేపడతామని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి స్పష్టం చేశారు. యాదాద్రి పంచనారసింహుల ఆలయాన్ని మంత్రి సందర్శించారు. క్షేత్రాభివృద్ధిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కొండ కింద పట్టణంలోని ప్రధాన రహదారిలో అండర్పాస్ నిర్మించడం వల్ల స్థానికుల ఉపాధికి తీవ్ర అవరోధం ఏర్పడిందని తెలిపారు. భక్తుల అవసరాలు గమనించకుండా.. చేపట్టిన పనులు పూర్తి కావడానికి రూ.300 కోట్లు అవసరమని వైటీడీఏ అధికారులు చెబుతున్నారన్నారు. గత ప్రభుత్వం విశ్రాంత అధికారులతో చేపట్టిన పనులపై ఆరా తీయనున్నట్లు చెప్పారు. త్వరలో మరో సమీక్ష సమావేశం నిర్వహించి యాదాద్రిలో చోటుచేసుకున్న లోపాలను సరిచేయడంతోపాటు భక్తులకు అవసరమైన వసతులను సమకూర్చేలా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. భక్తులు దేవుడి చెంత నిద్రచేసే మొక్కుకు అవకాశం కల్పించాలని అధికారులకు మంత్రి సూచించారు. స్వామివారిని భక్తులు ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు సులభంగా దర్శనం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని, క్షేత్రానికి వచ్చే ఆదాయంపై కాకుండా భక్తుల అవసరాలపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. కొద్ది రోజుల్లోనే సీఎంను ఆహ్వానించి.. యాదగిరిగుట్ట, బస్వాపురం సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. క్షేత్ర పరిధిలో దాతలకు స్థలాలు కేటాయిస్తే వారే కాటేజీలు నిర్మించుకుంటారన్నారు. సమీక్షలో విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, జిల్లా కలెక్టర్ హన్మంత్ కె.జెండగే, డిప్యూటీ పోలీస్ కమిషనర్ రాజేశ్చంద్ర, వైటీడీఏ వైస్ ఛైర్మన్ కిషన్రావు, యాదాద్రి ఆలయ ఈవో రామకృష్ణారావు, పలువురు అధికారులు పాల్గొన్నారు.
భారత నౌకాదళానికి సంబంధించిన కీలక రాడార్ కేంద్రం తెలంగాణలో ఏర్పాటు కాబోతోంది. దేశంలోనే రెండో వీఎల్ఎఫ్ (వెరీ లో ఫ్రీక్వెన్సీ) కమ్యూనికేషన్ ట్రాన్స్మిషన్ స్టేషన్ను వికారాబాద్ జిల్లా పూడూరు మండలం దామగుండం రక్షిత అటవీ ప్రాంతంలో నెలకొల్పనున్నారు. ఇందుకోసం ఇక్కడి 1174 హెక్టార్ల భూమిని అటవీశాఖ నౌకాదళానికి అప్పగించింది. సంబంధిత ఒప్పంద పత్రాలపై బుధవారం సచివాలయంలో సీఎం రేవంత్రెడ్డి సమక్షంలో నావల్ కమాండ్ ఏజెన్సీ అధికారులు, అటవీ అధికారులు సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో విశాఖపట్నంలోని తూర్పు నౌకాదళం కమొడోర్ కార్తీక్ శంకర్, సర్కిల్ డీఈవో రోహిత్ భూపతి, కెప్టెన్ సందీప్దాస్, సీఎస్ శాంతికుమారి, అటవీశాఖ ముఖ్యకార్యదర్శి వాణీప్రసాద్, పీసీసీఎఫ్ ఆర్.ఎం.డోబ్రియాల్ పాల్గొన్నారు. వికారాబాద్ డీఎఫ్వో, నావల్ కమాండ్ ఏజెన్సీ అధికారులు అటవీ భూముల బదిలీ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ భూముల కోసం 2010 నుంచి నౌకాదళం రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతుండగా ఈ విషయం తాజాగా పరిష్కారమైందని ప్రభుత్వవర్గాలు తెలిపాయి. తమిళనాడులోని తిరునెల్వేలిలో ఐఎన్ఎస్ కట్టబొమ్మన్ రాడార్ స్టేషన్ దేశంలో మొదటి వీఎల్ఎఫ్ కేంద్రం. ఇది 1990 నుంచి నౌకాదళానికి సేవలందిస్తోంది. ఈ అటవీప్రాంతంలో ఉన్న ఆలయానికి భక్తుల రాకపోకలను అనుమతించేందుకు నౌకాదళం అంగీకరించింది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మెదక్ జిల్లాకు చెందిన నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలవడంపై దుమారం రేగుతోంది. ఈ అంశంపై దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి స్పందించారు. రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్రమోదీని కలుస్తున్నారని.. అలాంటప్పుడు మేం సీఎం రేవంత్ రెడ్డిని కలిస్తే తప్పేమిటని ప్రశ్నించారు. తనపై హత్యాయత్నం జరిగిన తర్వాత కూడా తన గన్మెన్లను కుదించడం పట్ల… వారి పనివేళల్లో మార్పుల పట్ల ఇంటెలిజెన్స్ ఐజీని కలిసినట్లు తెలిపారు. ఇదే అంశంపై ముఖ్యమంత్రిని కలిశామన్నారు. ఇలా కలవడంలో తప్పేముంది? అన్నారు. దుబ్బాక నియోజకవర్గంలో జరగాల్సిన అభివృద్ధిపై ముఖ్యమంత్రితో చర్చించేందుకు కలిసినట్లు తెలిపారు. అలాగే ప్రోటోకాల్ విషయంలో నిబంధనలు పాటించడం లేదని ఆయన దృష్టికి తీసుకు వెళ్లినట్లు చెప్పారు. సీఎంను కలిసినంత మాత్రాన తమ నలుగురు ఎమ్మెల్యేలపై బురదజల్లడం మానుకోవాలని కోరారు. మెదక్ జిల్లా బీఆర్ఎస్ అడ్డా అని చెప్పారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అత్యధిక స్థానాలు గెలుస్తుందని… మెదక్లోను పార్టీని గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.
తెలంగాణలో ధరణి పోర్టల్ వ్యవస్థపై మరింత లోతైన అధ్యయనం చేసే దిశలో ప్రభుత్వం నియమించిన కమిటీ ముందుకెళ్తోంది. కలెక్టర్లతో సమావేశమైన కమిటీ.. పోర్టల్లో అనేక లోపాలున్నాయని గుర్తించింది. 35 మ్యాడ్యూల్స్ ప్రజలకు ఉపయోగపడేట్లు లేవని తేల్చింది. 18లక్షల ఎకరాలు నిషేధిత జాబితాలో ఉన్నట్లు అధికారిక లెక్కలు వెల్లడిస్తుండగా.. 23 లక్షల ఎకరాలు పార్ట్-బిలో ఉన్నట్లు కమిటీ దృష్టికి వచ్చినట్లు తెలుస్తోంది. కలెక్టర్లతో సుదీర్ఘంగా చర్చించిన కమిటీ… ఈనెల 27న గిరిజన, అటవీ, వ్యవసాయ శాఖల అధికారులతో సమావేశం కావాలని నిర్ణయించింది. భూ రికార్డులను కంప్యూటరీకరణ చేసిన గత ప్రభుత్వం ధరణి పోర్టల్ పరిధిలోకి తీసుకొచ్చింది. సంకల్పం గొప్పదైనా.. ఆచరణలో మాత్రం ఇబ్బందులు వచ్చాయి. ఎన్నికల సమయంలో ధరణి పోర్టల్ను రద్దు చేస్తామని.. దాని స్థానంలో మెరుగైన మరో వ్యవస్థను తీసుకొస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ప్రభుత్వం ఏర్పడగానే ధరణి పోర్టల్ వ్యవస్థపై అధ్యయనానికి కమిటీని వేసింది. నాలుగుసార్లు సమావేశమైన కమిటీ ధరణి పోర్టల్ అమలులో అనేక లోపాలు ఉన్నట్లు గుర్తించింది. సచివాలయంలో ఐదు జిల్లాల కలెక్టర్లతో సుదీర్ఘంగా సమావేశమైంది. కలెక్టర్లు సైతం చాలా లోపాలను తమ దృష్టికి తెచ్చారని కమిటీ పేర్కొంది. తెలంగాణలో భూసమస్యలను పరిష్కరించాలంటే ధరణి సాఫ్ట్వేర్ను మార్చితే సరిపోదని..చట్టాలను సైతం మార్చాల్సిన అవసరం ఉందని కమిటీ ప్రాథమికంగా అభిప్రాయపడింది. ధరణి పోర్టల్ వ్యవస్థ సామాన్య ప్రజలకు ప్రయోజనం చేకూర్చేట్లు లేదని వ్యాఖ్యానించింది.
కోడికత్తి కేసులో నిందితుడు శ్రీను బెయిల్ పిటిషన్పై తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. హత్యాయత్నం కేసులో నాలుగున్నరేళ్లకు పైగా నిందితుడు జైల్లో మగ్గుతున్నాడని, బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ గతంలో ఎన్ఐఏ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించడంతో ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. సీఎం జగన్ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పకుండా విచారణ ప్రక్రియ ఆలస్యం అయ్యేలా చేస్తున్నారని, దీంతో నిందితుడు జైల్లోనే మగ్గుతున్నాడని పిటిషనర్ తరఫు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తెచ్చారు. హత్యాయత్నం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఇంతకాలం జైల్లో ఉండటం సరికాదని కోర్టుకు వివరించారు. వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది.
భారతమాల, రీజినల్ రింగ్ రోడ్ RRR భూసేకరణపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి… ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వ ‘భారతమాల’ పథకంలో భాగంగా.. తెలంగాణలో నిర్మించనున్న జాతీయ రహదారికి అవసరమైన భూసేకరణ త్వరిగతిన పూర్తి చేయాలని లేఖలో కోరారు. రీజనల్ రింగ్ రోడ్డు -RRR భూసేకరణ కోసం NHAI కి 50 శాతం నిధులను జమ చేయాలని కిషన్ రెడ్డి …సీఎం రేవంత్రెడ్డికి విజ్ఞప్తి చేశారు. RRR భూసేకరణ కోసం నాయ్ కు 50 శాతం నిధులు ఇవ్వాలని కోరారు. గతంలో ఇవే అంశాలకు సంబంధించి బిఆర్ఎస్ ప్రభుత్వానికి లేఖలు రాసినా స్పందించలేదన్నారు. ఇప్పటికైనా ప్రాజెక్ట్ లు ఆలస్యం కాకుండా చర్యలు తీసుకోవాలని కిషన్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు.
ప్రభుత్వంతో మాట్లాడి ఆంధ్ర – కర్ణాటక ప్రభుత్వాలతో కలిపి కేంద్రంపై ఒత్తిడి తెచ్చి మద్దతు ధర వచ్చేలా కృషి చేస్తానని మంత్రి తుమ్మల రైతులకు హామి ఇచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. దమ్మపేట మండలం, అల్లిపల్లి గ్రామంలో ఆంధ్ర పామాయిల్ రైతులు మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిశారు. కేంద్ర ప్రభుత్వం ఏకపక్ష వైఖరి నిర్ణయాల వల్ల పామాయిల్ రైతాంగానికి అపార నష్టం వస్తుందని రైతులు మంత్రికి తెలిపారు. ప్రస్తుతం ఉన్న12 వేల చిల్లర ధర.. గిట్టుబాటు కావడం లేదని లేబర్ కాస్ట్ , ఫెర్టిలైజర్స్ కాస్ట్ పెరిగిపోవడంతో కనీసం 18 వేలకు మద్దతు ధర అయితే రైతులకు గిట్టుబాటు అవుతుందన్నారు. ఒక ఆంధ్ర రాష్ట్రమే కేంద్రంపై పోరాడితే సరిపోదని తెలంగాణ, కర్ణాటక కూడా సమిష్టిగా కేంద్రంపై ఒత్తిడి తెచ్చి.. మద్దతు ధర వచ్చేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరారని తుమ్మల అన్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినవి 420 హామీలని మాజీ మంత్రి కెటిఆర్ విమర్శించారు. కరీంనగర్లో బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లతో కేటీఆర్ భేటీ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చింది ఆరు గ్యారెంటీలు కాదని.. మొత్తం 420 హామీలు ఇచ్చిందని అన్నారు. మేనిఫెస్టోలో కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలని అమలు చేయకపోతే బట్టలు విప్పి కాంగ్రెస్ నేతలను నడిరోడ్డుపై నిలబెడతామని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల పేరుతో హామీల అమలును వాయిదా వేయాలని చూస్తోందని.. ఎంపీ ఎన్నికలకు ముందే ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై తెలంగాణ ప్రజలు ఇప్పటికీ విశ్వాసంతో ఉన్నారన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా.. పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధిస్తామని కేటిఆర్ ధీమా వ్యక్తం చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పెద్ద ఓటమేమి కాదని.. 39 సీట్లు రావడం చిన్న విషయం కాదని అభిప్రయపడ్డారు. ప్రభుత్వాలు వస్తుంటాయి.. పోతుంటాయని.. కేసులకు ఎవరూ భయపడొద్దని, తాము అండగా ఉంటామని కెటిఆర్ భరోసా ఇచ్చారు.