ఆరోగ్యమే మహాభాగ్యమని చెబుతుంటారు. ఆ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజూ వ్యాయామం, రన్నింగ్ లేదా వాకింగ్ చేయడం ఎంతో అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. అలాంటి సందేశాన్నే తన జీవితంలో ఆచరిస్తూ మరెందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు ఇంటెలిజెన్స్ ఇన్స్పెక్టర్ దుబ్బ కిషన్. మే నెలలో వరుసగా 31 రోజులు 21 కిలోమీటర్ల రన్ పూర్తి చేసిన ఆయనను చెంగిచెర్ల శాంతివనం రన్నర్స్, ఎల్బీనగర్ రన్నర్స్ ఘనంగా సన్మానించారు. ఉప్పల్ భగాయత్లో నిర్వహించిన కార్యక్రమంలో ఇంటెలిజెన్స్ ఇన్స్పెక్టర్ దుబ్బ కిషన్ను శాలువాతో సత్కరించి ఘనంగా అభినందించారు. ప్రతిరోజూ కనీసం అరగంటపాటు రన్నింగ్ లేదా వాకింగ్ చేస్తే ఆరోగ్యంగా ఉండటంతో పాటు ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదన్నారు. 2012లో రన్నింగ్ ప్రారంభించిన తాను, 2021లో ఎయిర్టెల్ మారథాన్లో పాల్గొని మారథాన్ ప్రయాణాన్ని మరింత విస్తరించానని తెలిపారు.తన విజయాన్ని చూసి మరికొందరు కూడా రన్నింగ్ వైపు ఆకర్షితులై ఆరోగ్యవంతమైన జీవనశైలిని అలవర్చుకోవాలని ఆకాంక్షించారు. అయితే ఇలాంటి రన్లలో పాల్గొనేటప్పుడు ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని, తమకు సాధ్యమైన మేరకు మాత్రమే పాల్గొనాలని సూచించారు.
Tag:





Total views : 90426