కాంగ్రెస్ పార్టీ తీరుపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పార్లమెంటు సమావేశాల వేళ సభలో చర్చల్లో పాల్గొనకుండా, ప్రధానమంత్రి నివాసం వెలుపల నిరసనల పేరుతో రాజకీయ నాటకాలకు తెరలేపడం దురదృష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాల బాధ్యత పార్లమెంటులో ప్రశ్నలు అడగటం, చర్చలు జరపడమే తప్ప, సభా కార్యకలాపాలకు విఘాతం కలిగించడం కాదని ఆయన హితవు పలికారు. సభలో చర్చకు ఆస్కారం లేకుండా పదేపదే అంతరాయం కలిగిస్తూ, వాయిదాలకు కారణమవుతున్న కాంగ్రెస్, బయటకు వచ్చి ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందంటూ నాటకాలాడుతోందని కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఇది బాధ్యతాయుతమైన ప్రతిపక్షం చేయాల్సిన పని కాదని, ప్రజాస్వామ్యాన్ని అస్థిరపరిచే కుట్ర అని ఆయన ధ్వజమెత్తారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఎమర్జెన్సీ విధించి ప్రజాస్వామ్యాన్ని కాలరాసిన కాంగ్రెస్ పార్టీ, నేడు ప్రజాస్వామ్యం విలువల గురించి మాట్లాడటం హాస్యాస్పదమని విమర్శించారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, అసోం, పుదుచ్చేరి వంటి అనేక రాష్ట్రాల ఎన్నికల్లో ప్రజలు ఇప్పటికే కాంగ్రెస్ను తిరస్కరించారని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. ఆ పార్టీ ప్రజాసేవ కంటే రాజకీయ అవకాశవాదానికే పెద్దపీట వేస్తుందని, ప్రజలు ఇప్పటికే వారి నిజస్వరూపాన్ని గుర్తించారని ఆయన పేర్కొన్నారు. నిరసనలో భాగంగా కాంగ్రెస్ నేతలు ప్రతీకాత్మకంగా చేతులకు సంకెళ్లు వేసుకోవడంపై ఆయన ఎద్దేవా చేస్తూ, ఆ పార్టీ రాజకీయ ఆకాంక్షలకు భారత ప్రజలు ఎప్పుడో సంకెళ్లు వేశారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్కు నిజంగా వాదనలు వినిపించాలనే చిత్తశుద్ధి ఉంటే పార్లమెంటులో చర్చకు రావాలని ఆయన సవాల్ విసిరారు. దేశానికి బాధ్యతాయుతమైన ప్రతిపక్షం అవసరమే కానీ, నిరంతరం గందరగోళం సృష్టించే ప్రతిపక్షం కాదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
Tag:




Total views : 223597