Police
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ప్రభుత్వ యంత్రాంగం సంసిద్ధంగా ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ఆయా రాష్ట్రాలు, సరిహద్దు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలు, సీఈవోలు ఇతర అధికారులతో కేంద్ర ఎన్నికల సంఘం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. ఈ సందర్భంగా తెలంగాణ సీఎస్ శాంతికుమారి, డీజీపీ అంజనీ కుమార్లు రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయన్నారు. సాధారణ నేర కార్యకలాపాలు తగ్గుముఖం పట్టాయన్నారు. సరిహద్దు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలతో మాట్లాడి సరిహద్దు చెక్ పోస్టులను కట్టుదిట్టం చేశామన్నారు. రాష్ట్రంలో నిఘా మరింత పెంచామన్నారు. ఇప్పటి వరకు రూ.385 కోట్ల మేర నగదును జప్తు చేసినట్లు చెప్పారు. 182 మందిని ముందస్తుగా అదుపులోకి తీసుకున్నామన్నారు. తెలంగాణ సరిహద్దులోని పదిహేడు జిల్లాల్లో 166 చెక్ పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. సరిహద్దుల్లోని పొరుగు రాష్ట్రాల్లో 154 చెక్ పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. ప్రజల రాకపోకలకు అవకాశం లేకుండా పోలింగ్ తేదీకి ముందే సరిహద్దులను మూసివేసి, అప్రమత్తంగా ఉండాలని సూచిన్నట్లు తెలిపారు.
అమరావతి సీఎం క్యాంపు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సీఎం జగన్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించి, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి నివాళులర్పించారు. “స్వాతంత్రోద్యమంలో ఆంధ్రులు” పుస్తకాన్ని సీఎం ఆవిష్కరించారు. ఉత్సవాలకు మంత్రులు రోజా, ఉషాశ్రీచరణ్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ రాశారు. తనపై కస్టోడియల్ హింసకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తనను హింసించిన వారిలో ఇద్దరు ఐపీఎస్లు ఉన్నారని వివరించారు. పీవీ సునీల్ కుమార్, పీఎస్ఆర్ ఆంజనేయులు హింసించారని తెలిపారు. వారిపై సీబీఐ లేదా ఎన్ఐఏతో దర్యాప్తు చేయించాలని ప్రధానికి రాసిన లేఖలో రఘురామ కోరారు. రాష్ట్ర ప్రభుత్వంపై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారంటూ ఏపీ సీఐడీ గతంలో రఘురామను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. పోలీసు కస్టడీలో తనను హింసించినట్లు అప్పట్లోనే ఆయన ఆరోపించారు. ఈ నేపథ్యంలో తాజాగా ఇద్దరు అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ ప్రధానికి రఘురామ లేఖ రాశారు.
భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు వాహనాన్ని తనిఖీ చేశారు పోలీసులు. ఎన్నికల సిబ్బంది పార్టీ కార్యక్రమంలో పాల్గొనేందుకు కామారెడ్డి వెళుతున్న భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారకరామారావు వాహనాన్ని పోలీసులు ఆపారు. తూప్రాన్ వద్ద మంత్రి వాహనాన్ని ఆపడంతో.. తన వాహన తనిఖీకి పూర్తిగా సహకరించారు కేటీఆర్. తనిఖీ అనంతరం కేటీఆర్ కామారెడ్డికి బయలుదేరారు.
శ్రీకాళహస్తి మండలం కమ్మ కొత్తూరు గ్రామంలో పోలీసులకి తెలుగుదేశం పార్టీ నాయకులు మధ్య వివాదం చిలికి చిలికి గాలి వానలా మారింది. తెలుగుదేశం పార్టీ చేపట్టిన జగనాసుర కార్యక్రమంలో పోలీసులకు తెలుగుదేశం పార్టీ నాయకులు మధ్య జరిగిన చిన్న వివాదం విదితమే. తెలుగుదేశం పార్టీ శ్రీకాళహస్తి ఇంచార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి టిడిపి నాయకులను వెంటబెట్టుకుని నిన్న ఉదయం శ్రీకాళహస్తి రూరల్ పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పోలీసులపై విరుచుకు పడ్డారు. ఈ తరుణంలో పోలీసులు 26 మంది పై ఆరు రకాల సెక్షన్లో కేసులు బనాయించారు.
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి. పార్టీ శ్రేణులతో కలిసి రూరల్ పోలీస్ స్టేషన్ ను ముట్టడించారు. శ్రీకాళ హస్తి రూరల్ మండలంలోని కామ కొత్తూరు గ్రామంలోని చెంచయ్య నాయుడు ఇంటి వద్దకు వెళ్లి రూరల్ సీఐ అజయ్ కుమార్ అసభ్య పదజాలంతో దూషించండం వివాదంగా మారింది. ఇదే అంశంపై బొజ్జల సుధీర్ రెడ్డి..సీఐతో మాట్లేడేందుకు ప్రయత్నించగా. సుధీర్ రెడ్డి పై కూడా సీఐ అజయ్ కుమార్ అసభ్య పదజాలంతో దూషించడంతో వివాదం మారింత తీవ్రంగా మారిపోయింది. ఈ నేపధ్యంలో రూరల్ పోలీస్ స్టేషన్ వద్దకు పెద్ద ఎత్తున్న చేరుకున్న టీడీపీ శ్రేణులు స్టేషన్ ను ముట్టడించారు. సిఐ అజయ్ కుమార్ బయటకు వచ్చి క్షమాపణ చెప్పాలంటూ బైఠాయించారు. తిరుపతి SP తో ఫోన్లో మాట్లాడి… సిఐ అజయ్ కుమార్ పై చర్యలు తీసుకోవాలని డి.ఎస్.పి కి వినతి పత్రం అందజేశారు.
పోలీసుల అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా అమర వీరుల త్యాగాలను స్మరించుకుంటూ జిల్లా పోలీస్ శాఖ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసింది. జిల్లాలోని పోలీసులతో పాటు వివిధ ప్రాంతాల్లో ప్రజలు, విద్యార్థులు స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేశారు. అనంతరం రక్తదానం చేసిన పోలీసులకు ,విద్యార్థులకు, ప్రజలకు తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి చేతుల మీదుగా ప్రశంసా పత్రాలను అందజేశారు.
హైదరాబాద్లో సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు భారీగా హవాలా నగదును పట్టుకున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ పోలీసులు పెద్ద మొత్తంలో హవాలా నగదును పట్టుకోవడం గమనార్హం. పోలీసుల తనిఖీల్లో దాదాపు రూ.30 లక్షల నగదు, మూడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు. నగదును తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన నగదుతో పాటు అదుపులోకి తీసుకున్న ముగ్గురు వ్యక్తులను టాస్క్ ఫోర్స్ పోలీసులు… రెయిన్ బజార్ పోలీస్ స్టేషన్కు అప్పగించారు.