ప్రముఖ విద్యావేత్త, పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ ఆరోగ్యం మరింత క్షీణించింది. దీంతో ఆయనను ఢిల్లీలోని సఫ్దర్జంగ్ ఆసుపత్రి నుంచి గురుగ్రామ్లోని మేదాంత ఆసుపత్రికి తరలించారు. గత 24 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న ఆయన ఆరోగ్య పరిస్థితిని సమీక్షించిన ఢిల్లీ హైకోర్టు, ఆయన కోరుకున్న ఆసుపత్రికి తరలించాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రధాన న్యాయమూర్తి దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. వాంగ్చుక్కు నిరంతర వైద్య పర్యవేక్షణ అవసరమని ఎయిమ్స్, సఫ్దర్జంగ్ వైద్యులతో పాటు ఆయన వ్యక్తిగత వైద్యులు కూడా అభిప్రాయపడటంతో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. ఆయనకు మెరుగైన చికిత్స అందించేందుకు మేదాంత ఆసుపత్రిలో ప్రత్యేక వైద్య బృందాన్ని ఏర్పాటు చేయాలని సూచించింది.
సఫ్దర్జంగ్ ఆసుపత్రి విడుదల చేసిన బులెటిన్ ప్రకారం, ఆయన కీలక ఆరోగ్య పారామీటర్లు నిలకడగా ఉన్నప్పటికీ, పోషకాహార లోపం వల్ల రక్త కణాలు, సీరమ్ పొటాషియం స్థాయిలు తక్కువగా ఉన్నట్లు తేలింది. చికిత్స కొనసాగింపు కోసం ఆయనకు సంబంధించిన మెడికల్ రికార్డులన్నింటినీ మేదాంత ఆసుపత్రికి అందజేశారు. అయితే, ఆసుపత్రికి మారినప్పటికీ తన నిరాహార దీక్షను కొనసాగిస్తానని వాంగ్చుక్ స్పష్టం చేసినట్లు ఆయన భార్య గీతాంజలి తెలిపారు. ‘సంసద్ చలో’ యాత్రలో విద్యార్థులపై జరిగిన లాఠీఛార్జ్కు నిరసనగా, వారికి సంఘీభావంగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని వివరించారు. విద్యా సంస్కరణలు, నీట్ వంటి పరీక్షా పత్రాల లీకేజీలపై పార్లమెంటులో చర్చించాలని డిమాండ్ చేస్తూ వాంగ్చుక్ జూన్ చివరి నుంచి జంతర్ మంతర్ వద్ద దీక్ష చేస్తున్నారు.




Total views : 223598