ప్రముఖ సినీనటి, మాజీ ఎంపీ, బీజేపీ నాయకురాలు జయప్రదను అరెస్టు చేయాలని ఉత్తరప్రదేశ్లోని ప్రత్యేక కోర్టు పోలీసులను ఆదేశించింది. ఆమె ‘పరారీలో ఉన్న నిందితురాలు’ అని అధికారికంగా ప్రకటించింది. జయప్రదపై ఉన్న రెండు కేసుల విచారణ నిమిత్తం ఏడుసార్లు నాన్బెయిలబుల్ వారెంట్లు పంపించినప్పటికీ కోర్టుకు హాజరు కాకపోవడంతో కోర్టు మండిపడింది. జయప్రదను పట్టుకునేందుకు డీఎస్పీ ఆధ్యర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని రాంపూర్లోని ఎంపీ, ఎమ్మెల్యేల ప్రత్యేక న్యాయస్థానం జడ్జి శోభిత్ బన్సల్ జిల్లా ఎస్పీని ఆదేశించారు. జయప్రదను మార్చి ఆరో తేదీన కోర్టులో హాజరుపరచాలని సూచించారు. 2019 లోక్సభ ఎలక్షన్ల సందర్బంగా ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించారన్న ఆరోపణలతో జయప్రద మీద రెండు కేసులు నమోదయ్యాయి. ఆ ఎన్నికల్లో ఆమె బీజేపీ తరఫున రాంపూర్ లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి, సమాజ్వాదీ పార్టీ అభ్యర్థి అజాం ఖాన్ చేతిలో ఓటమిపాలయ్యారు.
Tag: