తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని శనివారం స్వర్ణరథోత్సవం వేడుకగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు రథాన్ని అధిరోహించి నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. సర్వాంగ సుందరంగా అలంకరించిన స్వర్ణరథాన్ని టీటీడీ మహిళా ఉద్యోగులతో పాటు పలువురు మహిళలు గోవిందనామస్మరణతో, భక్తిశ్రద్ధలతో లాగారు. స్వర్ణరథోత్సవాన్ని గ్యాలరీల్లో వేచి ఉన్న భక్తులు దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ కరుణాకరరెడ్డి,ఈవో.ధర్మారెడ్డి , జై ఓ వీరబ్రహ్మం..పాల్గొన్నారు.
Vykuntha ekadasi
కదిరి పట్టణంలో వెలసిన శ్రీమద్ ఖాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీ మహా విష్ణువుకు అత్యంత ప్రీతికరమైన వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు భక్తులు పెద్ద ఎత్తున స్వామి వారి దర్శనానికి విచ్చేశారు. రాత్రి 12 గంటల నుండి భక్తులు క్యూ లైన్ లో స్వామి దర్శనానికి వేచి ఉండగా తెల్లవారుజామున మూడున్నర గంటలకి ఉత్తర ద్వారా దర్శనానికి భక్తులను అనుమతించగా గోవింద నామస్మరణతో తిరువీధులు మారుమ్రోగాయి. ఎంతో విశిష్టమైన ఈ పర్వదినాన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దర్శనంతో భక్తులు పరవశించిపోయారు. ముందుగా స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ పివి సిద్ధారెడ్డి కుటుంబ సభ్యులతో పాటు, ఆలయ ఈవో వెండిదండి శ్రీనివాసరెడ్డి, చైర్మన్ గోపాలకృష్ణ, పాలకమండ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
సికింద్రాబాద్ జనరల్ బజార్ లో 100 సంవత్సరాల చరిత్ర ఉన్న లక్ష్మీనారాయణ స్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైకుంఠ ఏకాదశి ని పురస్కరించుకొని భక్తులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ చైర్మన్, ఆలయ కమిటీ ఈవో, ఆలయ ప్రధాన అర్చకుడు మాట్లాడుతూ.. సుమారు 100 సంవత్సరాల క్రితం మా కుటుంబీకులు ఈ ఆలయాన్ని స్థాపించారని తెలిపారు. వంశపారపర్యంగా మేము సేవలు చేస్తూ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలియజేశారు. ప్రతి పండుగను ఘనంగా నిర్వహించుకుంటామని తెలియజేశారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధీనంలో ఉన్నప్పటికీ సమిష్టిగా సేవలో కానీ, అభివృద్ధిలో కానీ కలిసి పని చేస్తూ ముందుకు వెళ్తామని తెలియజేశారు.
Read Also..
జమ్మలమడుగు పట్టణంలోని శ్రీ నారాపుర వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజామున నుంచి ఉత్తరద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున క్యూ కట్టారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి రాజేష్ స్వామి వైకుంఠ ఏకాదశి పండగ పర్వదినం విశిష్టతను తెలియజేశారు. ఈ రోజున స్వామి వారిని దర్శించుకుంటే సకల పాపాలు తొలగి శుభం కలుగుతాయని తెలిపారు. ఈ సందర్బంగా టిటిడి అధికారులు భక్తుల కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. శ్రీ నారాపురం వెంకటేశ్వర స్వామి గరుడ వాహనంలో భక్తులకు ఉత్తర మార్గంలో దర్శనమిచ్చారు. ఆలయానికి వచ్చిన భక్తులకు శ్రీవారి సేవా సమితి జమ్మలమడుగు సభ్యులు ప్రసాద వితరణ చేశారు.





Total views : 91091